బ్రేకింగ్: కాంగ్రెస్ నేత జంగా రాఘవ రెడ్డికి షోకాజ్ నోటీసు

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: కాంగ్రెస్ నేత జంగా రాఘవ రెడ్డికి షోకాజ్ నోటీసు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాల‌ని జంగా రాఘవ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ జి.చిన్నారెడ్డి నోటీసుల్లో ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి జంగా రాఘవ రెడ్డితో పాటు నాయిని రాజేందర్ రెడ్డిలు గైర్హాజ‌ర‌య్యారు. దీంతో పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా జంగా రాఘవరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. జంగా రాఘవరెడ్డి వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్‌ను బ‌ల‌హీన‌ప‌ర్చే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని, బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా రాజ‌కీయ ప‌రిస్థితిని మారుస్తున్నారంటూ ఇటీవ‌ల హ‌న్మకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్యర్‌తో కలిసి తనకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు అతికించాడని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా హనుమకొండ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. తనకే టికెట్ వస్తుందని అంటున్నాడని జంగాపై రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. గతంలోనూ జంగాపై ఫిర్యాదు చేశామని.. ఆయనకు పార్టీ పెద్దలు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారని నాయిని గుర్తు చేశారు. ఆయన వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని.. జంగా ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నామని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. తీర్మానం కాపీని అధిష్టానానికి పంపించామని.. అక్కడి స్పందనను బట్టి, తన రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తామని రాజేందర్ రెడ్డి వెల్లడించారు.

అయితే ఈ ప‌రిణామం త‌ర్వాత జంగా రాఘ‌వ‌రెడ్డి ప‌శ్చిమ‌ ప‌ర్యట‌న‌ల‌తో జోరు పెంచారు. ఎన్నిక‌ల ప్రచారాన్ని త‌ల‌పించే విధంగా భార‌త్ జోడో హాత్ సే హాత్ భార‌త్ జోడో యాత్ర పేరిట ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. తాజాగా పార్టీ క్రమ‌శిక్షణ చ‌ర్యల‌కు దిగ‌డంతో జంగా వైఖ‌రి ఎలా ఉండ‌బోతోంది? అన్న ఉత్కంఠ ఆయ‌న అనుచ‌రుల్లో వ్యక్తమ‌వుతుండ‌గా, నోటీసులు ఇవ్వడమంటే ఆయ‌న్ను క‌ట్టడి చేసేందుకు అధిష్ఠానం నిర్ణయించుకుంద‌న్న చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. నోటీసుల‌పై జంగా ఎలా రియాక్టవుతారా..? లేదా అన్నది చూడాలి.

Next Story

Most Viewed