రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్న డాక్టర్ ఎ.నటరాజు

by Dishafeatures2 |
రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్న డాక్టర్ ఎ.నటరాజు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వైద్యుడు, రెడ్ క్రాస్ సొసైటీలో పలు హోదాల్లో పని చేసిన లయన్. డాక్టర్ ఎ.నటరాజును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బంగారు పతకంతో ఘనంగా సత్కరించారు. సోమవారం రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయ, గవర్నర్లు తమిళిసై, బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. మూడు దశాబ్దాలుగా సమాజ సేవకు గుర్తింపుగా డాక్టర్ నటరాజుకు రాష్ట్రపతి బంగారు పతకాన్ని అందజేశారు. దేశ వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీలో ఇద్దరికీ మాత్రమే ఈ బంగారు పతకాన్ని అందజేయగా.. అందులో ఒకరు డాక్టర్ నటరాజు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ 100 ఏళ్లకు పైగా ప్రజలకు సేవ చేస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎ.నటరాజు మాట్లాడుతూ.. రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ తరపున చైర్మన్ అజయ్ మిశ్రా, జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ రావు, జాతీయ కమిటీ సభ్యులు విజయ్ చందర్ రెడ్డి హాజరయ్యారు.

మూడు దశాబ్దాలకు పైగా సమాజ సేవలో డాక్టర్ నటరాజు

నాగర్ కర్నూల్ పట్టణంలో స్వాతంత్ర్య సమర యోధుడు ఎ.చంద్ర శేఖర్, గౌరమ్మలకు 1956లో డాక్టర్ నటరాజు జన్మించారు. డాక్టర్ నటరాజు మూడు దశాబ్దాలకు పైగా సమాజసేవలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులో కొన్ని..

  • ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1990 నుంచి రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అందిస్తున్నారు. గతంలో పాలమూరు మాజీ కలెక్టర్ అనంత రాములు ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ కమిటీలో 3 ఏళ్లపాటు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత 2002లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కొత్తగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అప్పటి గవర్నర్ రంగ రాజన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు.
  • అంతటితో ఆగకుండా కేవలం అయిదు ఏళ్లలో అంటే 2007లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పది వేల బ్లడ్ యూనిట్స్ కలెక్షన్ చేయించడంతో, రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటిలో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుని నేటికీ 2023 వరకు కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు.
  • 2005లో నాటి కలెక్టర్ మధుసూధన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణం చేపట్టి సన్నిధి పేరుతో ఓ అనాధ శరణాలయం ఏర్పాటు చేశారు. నేటికీ ఆ అనాధ శరణాలయం ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతోంది.
  • కరోనా మహమ్మారి సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాస్కులు, సానిటైజేశన్, తాగునీరు, ఆహారం, ఎనర్జీ డ్రింక్స్ సరఫరా చేశారు. గుర్తు తెలియని శవాలు, అలాగే కరోనా సమయంలో దాదాపు 48 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా సమయం నుంచి సతీమణి కల్యాణి ఫౌండేషన్ పేరుతో ప్రతి ఏడాది బియ్యం, పప్పులు కిట్స్ అందిస్తున్నారు.
  • 2018లో డాక్టర్ ఎ.నటరాజు ఉమ్మడి పాలమూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ గా భాద్యతలు చేపట్టారు. మెంటల్ ఛాలెంజ్ చిన్నారులకు శాంతి వనం రెసిడెన్షియల్ పాఠశాల మరియు 2019లో మూగ చెవిటి విద్యార్థులకు అక్షర పాఠశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. స్వామి వివేకానంద ట్రస్ట్ అలాగే రెడ్ క్రాస్ కలిసి ఉమ్మడి పాలమూరులో 15 ఏళ్లుగా ప్రతి ఏడాది లక్ష నోటు బుక్కులు పేద విద్యార్థులకు అందిస్తున్నారు. 2018 నుంచి ప్రతి ఏడాది రెడ్ క్రాస్ చైర్మన్ హోదాలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, 5వేలు అందిస్తున్నారు. వికలాంగులకు ట్రై సైకిల్స్, కాలిబర్స్, కృత్రిమ కాళ్లు, చేతులు అందిస్తున్నారు.
  • 2021 నుంచి 2023 వరకు గత మూడేళ్లుగా NEETలో ర్యాంక్ సాధించిన పేద విద్యార్థులను ఎంపిక చేసి ముగ్గురికి మెడిసిన్ చదివేందుకు పూర్తి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా సమయంలో ఆక్సిజన్ కంటైనర్స్ ప్రజలకు అందుబాటులో ఉంచారు.
  • గత పదేళ్లుగా వర్షాకాలంలో తార్పాల్స్, బ్లాంకెట్స్, హైజనిక్ కిట్స్ వంటివి 50 వేల వరకు అందించారు. అలాగే గత 5 ఏళ్లుగా మెడికల్ కాలేజీలకు 21 డెడ్ బాడీస్, నేత్రదానం కోసం దాదాపు 140 నేత్ర దానాలు చేయించారు.
  • ఇప్పటి వరకు ఆరుగురి చేత ఆర్గాన్స్ డొనేషన్ చేయించడం జరిగింది. అలాగే రికార్డు స్ధాయిలో 1984 నుంచి 2023 నేటి వరకు 154 సార్లు రక్తదానం, ఆరు సార్లు ప్లాస్మా, ఆరు సార్లు ప్లేట్ లెట్స్ సొంతంగా ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2002 నుంచి నేటి వరకు రక్తదాన శిబిరాలు నిర్వహించి లక్ష 91 వేల బ్లడ్ యూనిట్స్ కలెక్షన్ చేయడంలో కృషి చేశారు.


Next Story