‘నోటీసులు కాదు.. అందరికీ టెర్మినేషన్ ఇవ్వండి’ విద్యుత్ ఆర్టిజన్ల సవాల్

by Ramesh Naini |

విద్యార్హత ఆధారంగా కన్వర్షన్, ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు, సమాన పనికి సమాన వేతనం తదితర డిమాండ్లతో ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె శుక్రవారం మూడో రోజు కూడా విజయవంతంగా సాగింది.

‘నోటీసులు కాదు.. అందరికీ టెర్మినేషన్ ఇవ్వండి’ విద్యుత్ ఆర్టిజన్ల సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్హత ఆధారంగా కన్వర్షన్, ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు, సమాన పనికి సమాన వేతనం తదితర డిమాండ్లతో ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె శుక్రవారం మూడో రోజు కూడా విజయవంతంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డివిజనల్ ఇంజినీర్ల కార్యాలయాల వద్ద ఆర్టిజన్లు టెంట్లు వేసుకుని సమ్మెకు దిగారు. మరోవైపు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ-జేఏసీ) నాయకులు శుక్రవారం ఇంధన కార్యదర్శి నవీన్ మిట్టల్ ను కలిసి తమ సమస్యలను పరిష్కరిస్తామంటే సమ్మె విరమిస్తామని చెప్పినా... సరైన స్పందన రాలేదని జేఏసీ నేతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు వెలుగు నిచ్చేందుకు తాము కొవ్వొత్తుల్లా కరుగుతున్నామని.. అయినా ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా వ్యవహరించడం లేదని టీవీఏఈ-జేఏసీ కో-చైర్మన్ ఎస్ శ్రీధర్ గౌడ్ తెలిపారు. తాము శాంతియుతంగా సమ్మె చేస్తున్నా పలు చోట్ల ఆర్టిజన్లను కొందరు అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీవీఏఈ-జేఏసీ తెలిపింది.

జెన్ కో పరిధిలోని కేటీపీపీ, కేటీపీఎస్‌లో పనిచేసే ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తీసేస్తామని ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా బెదిరిస్తున్నారని, నోటీసులు తీసుకోకుంటే ఇంటికి అంటించిపోతున్నారని టీవీఏఈ-జేఏసీ నేతలు తెలిపారు. సమ్మె చేస్తుంటే ఇంటికి పోయి బెదిరింపులకు పాల్పడటం కరెక్ట్ కాదని, అధికారుల తీరుకు నిరసనగా శనివారం ఛలో కేటీపీఎస్ కార్యక్రమం చేపట్టామని జేఏసీ కో-చైర్మన్ ఎస్ శ్రీధర్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఒక్కరికి నోటీసు ఇచ్చినా తామందరికీ టెర్మినేషన్ ఇచ్చి ఇంటికైనా పంపించాలని డిమాండ్ చేస్తామని ఆయన తెలిపారు. 30 ఏళ్లుగా వ్యవస్థకు వెట్టిచాకిరి చేస్తున్నామని, ఇకపై చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. తాము అడుగుతున్న డిమాండ్లలో ఒక్కటి కూడా ఆర్థిక పరమైన డిమాండే లేదన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఇంత ఘోరంగా వ్యవహరించడం పట్ల కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story