సమస్య పరిష్కారమైంది.. ప్రజలు ఆందోళన చెందవద్దు: కిషన్ రెడ్డి క్లారిటీ

by Gantepaka Srikanth |

దేశంలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు.

సమస్య పరిష్కారమైంది.. ప్రజలు ఆందోళన చెందవద్దు: కిషన్ రెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు దేశంలో సరిపడా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఇంధన సరఫరా మరియు ధరల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. "ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ అనే ప్రసక్తే లేదు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అది నమ్మవద్దు" అని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర లేదా పెట్రోల్ బంకుల వద్ద అనవసరంగా క్యూ కట్టి ఆందోళన చెందవద్దని కోరారు.

ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ..

ఇతర దేశాల నుంచి రావాల్సిన ఇంధనాన్ని వంద శాతం సకాలంలో తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తెలిపారు. "అంతర్జాతీయంగా అనేక దేశాలు సుంకాలు పెంచుతున్నప్పటికీ, సామాన్యుడిపై భారం పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా వ్యాట్ (VAT) తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలి" అని ఆయన సూచించారు. సరఫరా విషయంలో గతంలో రెండు, మూడు కంపెనీలకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమేనని, అయితే ప్రస్తుతం ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందని ఆయన వెల్లడించారు. ఇంధన సరఫరా వ్యవస్థ ఇప్పుడు గాడిలో పడిందని, ప్రజలు ఎవరూ తొందరపడి నిల్వలు చేసుకోవాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story