నాగమడుగు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన ఎప్పుడు ?

by Disha Web Desk 20 |
నాగమడుగు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన ఎప్పుడు ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నాలుగు మండలాల్లో నీరందించే నాగమడుగు ప్రాజెక్టు శంకుస్థాపన జరుగుతుందా అనే సంశయాలు వ్యక్తమౌతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చర్చలు జరిగిన అది కార్యరూపం దాల్చలేదు. ఈ నెల 13న యువరాజు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినా అది విధి వంచితమో తెలియదు కానీ వాయిదా పడింది. ఉమ్మడి జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన జుక్కల్ లో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మాణం స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు జీవన్మరణ సమస్యగా మారింది. ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన హన్మంత్ షిండే ఉద్యమకాలంలో టీఆర్ఎస్ లో చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి జుక్కల్ నియోజకవర్గంలో తలపున మంజిరా నది ప్రవహిస్తున్నా వట్టిపోతున్న నాలుగు మండలాల ప్రజలకు సాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏకైక ఎస్సీ నియోజకవర్గమైన జుక్కల్ లో పైన కౌలాస్ నాలా ప్రాజెక్టు ఉన్నా నిజాంసాగర్ మండలంలో నిజాంసాగర్ ఉన్నా నియోజకవర్గంలోని పలుమండలాలకు సాగునీరు దిక్కులేదు. ఈ నేపథ్యంలో గడిచిన ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే హన్మంత్ షిండే నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చేందుకు నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీ మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చిన సీఎం కేసీఆర్ తో శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే, ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే విశ్వప్రయత్నాలు చేశారు. అధికారులు కూడా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిఫ్యాడ్ ను ఓకే చేశారు.

కామారెడ్డి కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అటునుంచి అటే హైదరాబాద్ వెళ్లడంతో 2021లో జరిగిన కామారెడ్డి కలెక్టరేట్ ప్రారంభంతో నాగమడుగు ఎత్తిపోతల పథకం వాయిదా పడింది. తాజాగా యువరాజు కేటీఆర్ తో ప్రారంభించేందుకు స్థానిక శాసనసభ్యులు హన్మంత్ షిండే విశ్వప్రయత్నాలు చేశారు. అపాయింట్ మెంట్ తీసుకుని ఈ నెల 13న నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. నిజాంసాగర్ మండలం బూరుపల్లి వద్ద శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పిట్లం మండల కేంద్రంలో బహిరంగ సభకు అంకురార్పణ జరిగింది. ఎమ్మెల్సీ కవిత ఈడి కేసులో విచారణ ఎదుర్కొవడంతో దానిని అర్ధాంతరంగా రద్దు చేసేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏకైక ఎస్సీ నియోజకవర్గమైన జుక్కల్ నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ్యుడు హన్మంత్ షిండేకు నాగమడుగు ఎత్తిపోతల పథకం జీవన్మరణ సమస్యగా మారింది.

2018 ఎన్నికల సమయంలో ఆయన జుక్కల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 40 వేల ఎకరాల సాగునీరందించే ఎత్తిపోతల పథకాలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. హామీకి సీఎం కేసీఆర్ అంగీకరించి శంకుస్థాపనకు మాత్రం ముహూర్తబలం నోచుకోవడం లేదు. 2021లో ఒకసారి, 2022 మార్చిలో మరోసారి నాగమడుగు ఎత్తిపోతల పథకానికి వాయిదా పడింది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినా హన్మంత్ షిండే కోరిక నెరవేరే విధంగ కనిపించడం లేదు. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, పిట్లం, పెద్దకోడపగల్, బిచ్కుంద మండలాల్లోని 40వేల ఎకరాల్లో సాగునీరందించే ఎత్తిపోతల పథకానికి ముహూర్తం కుదరడం లేదు. తలపున మంజిరా నదితో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు, నల్లవాగు చెక్ డ్యాం ఉన్న నియోజకవర్గంలోని 40వేల ఎకరాలు సాగునీరు అందడం లేదని ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఈ కార్యక్రమానికి ఉత్సాహం చూపించారు.

అందుకనుగుణంగా సహజ సిద్దంగా ఇంజనీర్ అయిన హన్మంత్ షిండే నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని సంకల్పించారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఉంచడంతో 2022-23 ఎన్నికల్లో తన గెలుపు బాటలను నిర్ణయించేది నాగమడుగు ప్రాజెక్టేనని షిండే అనుకున్న అది తీరేలా కనిపించడం లేదు. ఒకసారి సీఎం కేసీఆర్ తో, రెండవసారి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తో ప్రారంభించాలనుకున్న అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. ప్రారంభిస్తారా లేదా అనేది అధికార బీఆర్ఎస్ నేతలపై ఆధారపడి ఉంది. నాగమడుగు ఎత్తిపోతల పథకం మాత్రం స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ షిండే గెలుపొటములు నిర్ణయిస్తాయని చెప్పవచ్చు.


Next Story