పాత నేరస్తున్ని పట్టించిన చెప్పులు

by Disha Web Desk 20 |
పాత నేరస్తున్ని పట్టించిన చెప్పులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాత్రి జరిగిన దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. సీసీ కెమెరాల సహాయంతో గ్రామంలో ఎవరైనా కొత్త వారు వచ్చారా అని పరిశీలించారు. కొత్త వారు ఎవరు రాకపోవడంతో సంఘటన స్థలం సమీపంలో ఉన్న కొన్ని ఆధారాలను సేకరించారు. ఆ ఆధారాల్లో దొరికిన చెప్పులు దొంగను పట్టించాయి. పాత నేరస్తుడు దొంగతనం చేసి పొరపాటున చెప్పులు వదిలి నడుచుకుంటూ వెళ్లాడు. దీంతో పోలీసులు అతని పాదముద్రలను పరిశీలించి నేరస్థునిగా నిర్ధారించారు.

అనంతరం అతన్ని పట్టుకుని కటకటాలవెనక్కి పంపినట్టు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఎల్లారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొల్లారం గ్రామంలో ఈ నెల 12న అర్ధరాత్రి జరిగిన చోరి కేసును చేదించినట్లు తెలిపారు. ఈ నెల 11న బొల్లారం గ్రామానికి చెందిన సుజాత కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుండడంతో తాము ఉంటున్న ఇంటికి తాళం వేసి వెళ్లిందని డీఎస్పీ తెలిపారు. అదే గ్రామానికి చెందిన పాత నేరస్తుడు మంగళి గౌరిశంకర్ ఇంట్లో చోరికి పాల్పడి 23 గ్రాముల బంగారు ఆభరణాలను, 74 తులాల వెండి నగలు, రూ.30 వేల నగదును చోరి చేశారన్నారు.

చోరి అనంతరం గౌరిశంకర్ ఇంటి వెనుక ప్రాంతంలో చెప్పులను వదిలేసి వెళ్లగా అతని పాదముద్రలు కనిపించాయి. పోలీసులు ముందుగా గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా గ్రామంలోకి కొత్త వారు వచ్చినట్లు ఏమి లేకపోవడంతో పాత నేరస్తుడు అయిన మంగళి గౌరిశంకర్ ను అదుపులోకి తీసుకోవడంతో కేసు కొలిక్కి వచ్చింది. తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు కేసు చేధించడం సులువుగా మారిందన్నారు. ఈ కేసును చేదించిన ఎల్లారెడ్డి సీఐ, నాగిరెడ్డిపేట్ ఎస్సై , సిబ్బందిలను కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.



Next Story

Most Viewed