యథేచ్ఛగా ఇసుక దందా.. పట్టించుకోని అధికార యంత్రాంగం

by Dishanational2 |
యథేచ్ఛగా ఇసుక దందా.. పట్టించుకోని అధికార యంత్రాంగం
X

గోదావరి నది, వాగులు ఇసుక అక్రమ రవాణాదారులకు కాసులు కురిపిస్తున్నాయి. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంతా అన్న చందంగా ఇసుకను అడ్డగోలుగా రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. అందినకాడికి సహజ సంపదను కొల్లగొడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇసుక దందా జోరుగా నడుస్తున్నా పట్టించుకోవాల్సిన రెవెన్యూ, పోలీస్​ అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడడం లేదు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులు యథేచ్ఛగా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యహరించడంతో అక్రమ దందా సాఫీగా జరుగుతోంది. మరోవైపు డివిజన్​లో ఇసుక రీచ్ లు, స్టాక్​ పాయింట్​లు లేకపోవడంతో ఇసుక అక్రమంగా తరలిపోతుంది. అంతేకాక అక్రమార్కులు చెప్పిన ధరకే ప్రజలు ఇసుకను కొనుగోలు చేయక తప్పడం లేదు. ఇది అక్రమార్కులకు వరంగా మారగా, వినియోగదారులకు మాత్రం భారంగా మారింది.

దిశ, ఇబ్రహీంపట్నం : గోదావరి నది, వాగులు ఇసుక అక్రమ రవాణాదారులకు కాసులు కురిపిస్తున్నాయి. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంతా అన్న చందంగా ఇసుకను అడ్డగోలుగా ట్రాక్టర్లలో తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. అందిన కాడికి సహజ సంపదను కొల్లగొడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుక దందా జోరుగా నడుస్తున్నా పట్టించుకోవాల్సిన రెవెన్యూ, పోలీస్​ అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడకపోవడం లేదు. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులు యథేచ్ఛగా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యహరించడంతో అక్రమ దందా సాఫీగా జరుగుతోంది. మరోవైపు డివిజన్​లో ఇసుక రీచ్​లు, స్టాక్​ పాయింట్​లు లేకపోవడంతో ఇసుక అక్రమంగానే తరలిపోతుంది.

గోదావరి, వాగుల నుంచి రవాణా..

మెట్​పల్లి డివిజన్​లోని మెట్​పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్​ మండలాల్లో ఇసుక దందా జోరుగా నడుస్తోంది. మెట్​పల్లి మండలంలోని రామలచ్చక్కపేట, ఇబ్రహీంపట్నం మండలంలోని కోమటికొండాపూర్​, ఎర్ధండి, మూలరాంపూర్​, వేములకుర్తి గోదావరి నది పరీవాహక ప్రాంతాల నుంచి, మల్లాపూర్​ మండలంలోని వీవీరావుపేట, వాల్గొండ, కొత్తదాంరాజ్​పల్లి, పాతదాంరాజ్ పల్లి, రేగుంట, సాతారం, ముత్యంపేట, సంగెం–శ్రీరాంపూర్​ ప్రాంతంలోని గోదావరి నది, ఇతర వాగుల నుంచి ఇసుక తరలిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల అవసరాల నిమిత్తం మెట్​పల్లి డివిజన్​లో ఇసుక రీచ్​లు లేకపోవడంతో ఇసుకకాసురులకు వరంగా మారగా వినియోగదారులకు మాత్రం భారంగా మారింది. దీంతో వారు చెప్పిన ధరకే ఇసుక తెప్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. గతంలో ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెట్​పల్లి పట్టణంలో అధికారులు ఇసుక స్టాక్​ పాయింట్లను ఏర్పాటు చేశారు. కానీ వీటిలో ఇసుక ధర ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు సద్వినియోగం చేసుకోకపోవడంతో స్టాక్​ పాయింట్లను కొద్దిరోజులకే మూసివేశారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

మెట్​పల్లి డివిజన్​‌లో ఇసుక రీచ్​లు, స్టాక్ పాయింట్​​లు ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. రీచ్​లు గానీ స్టాక్​ పాయింట్​లు ఏర్పాటు చేసి ఇసుక విక్రయిస్తే సీనరేజ్​ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంబంధిత శాఖల అధికారులు ఆ దిశగా చర్యలు చేపడితే ప్రజలకు అందుబాటులో ఇసుక లభించడంతోపాటు వినియోగదారులకు వెసులుబాటయ్యే ధరల్లో ఇసుక లభిస్తుంది.

నెంబర్​ ప్లేట్లు లేని వాహనాల్లోనే..

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్​ల యాజమానులు కనీస నిబంధనలు పాటించడం లేదు. ట్రాక్టర్లలకు నంబర్​ ప్లేట్​లు లేకపోవడంతోపాటు ఎక్కువగా మైనర్లనే డ్రైవర్లుగా పెట్టుకుంటున్నారు. ద్విచక్రవాహనాలకు నంబర్​ ప్లేట్లు లేకుండా నడిపితే వారిపై చర్యలు తీసుకునే అధికారులు ఇసుక ట్రాక్టర్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed