వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిమ్స్..!

by Disha Web Desk |
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిమ్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిమ్స్​వివాదాలకు.. వసూళ్లకు కేరాఫ్​అడ్రస్​గా మారింది. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లపై నిర్లక్ష్యం చూపుతుంది. ఓపీ.. ఎమర్జెన్సీ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తన ప్రతిష్టను తనే దిగజార్చుకుంటున్నది. ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి పర్యటించిన సందర్భంగా పేషెంట్లకు ఇబ్బందులు కలిగించొద్దని ఆదేశించినా స్టాఫ్ లో మార్పులేదు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం కారణంగా తాజాగా ఓ పేషెంట్ మృతి చెందారు. గుండె ప్రాబ్లమ్ తో ఈనెల 10న వచ్చిన పేషెంట్ ఫయాజ్ కు పలుమార్లు ఆపరేషన్ వాయిదా వేశారు. చివరకు బుధవారం ఆపరేషన్​చేసి చంపేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్‌ థియేటర్‌‌లోకి పిలిస్తే పేషెంట్‌ నడుచుకుంటూ వెళ్లి.. శవమై తిరిగొచ్చాడని బాధితులు ఆవేదవ వ్యక్తంచేస్తున్నారు. ఆపరేషన్ సక్సెస్ అంటూ.. పేషెంట్ కండీషన్ బాగుందని, మరోసారి సీరియస్‌గా ఉందని ఇలా గురువారం ఉదయం 4 గంటల వరకూ డాక్టర్లు చెబుతూ వచ్చారని, అనుమానం వచ్చి పేషెంట్‌ను చూపించాలని కోరితే హడావుడి చేశారని బాధిత కుటుంబం వాపోయింది. చివరకు పేషెంట్ చనిపోయాడని స్టాఫ్​చెప్పినట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఏం జరిగిందని? ప్రశ్నించినా.. డాక్టర్లు, స్టాఫ్​చెప్పడంలేదని తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్​చేశారు.

ఆరోగ్యశ్రీ లేదంటూ పైసలు వసూలు

నిమ్స్ లో ఆరోగ్య శ్రీ లేదని కొందరు డాక్టర్లు, స్టాఫ్​ఓవర్​యాక్షన్​చేస్తుండగా గురువారం ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2021లో ఓ పేషెంట్‌ఆస్పత్రికి వస్తే సర్జరీ చేయాలని న్యూరాలజీ డాక్టర్లు చెప్పి థియేటర్ వరకూ తీసుకెళ్లి సర్జరీ రద్దు చేశారు. కానీ, డిశ్చార్జ్ సమ్మరీలో మాత్రం మరో 2 నెలల తర్వాత రావాలని ఎంట్రీ చేశారు. దీన్ని పేషెంట్, కుటుంబ సభ్యులు చూసుకోలేదు. అదే పేషెంట్‌ మళ్లీ సమస్యతో బాధపడుతూ బుధవారం ఉస్మానియా హాస్పిటల్‌కు వెళ్లాడు. డాక్టర్లు నిమ్స్‌ డిశ్చార్జ్ సమ్మరీ చూసి ఆపరేషన్ జరిగిందని సదరు పేషెంట్ కు చెప్పడంతో షాక్​కి గురయ్యాడు. మళ్లీ నిమ్స్‌కే వెళ్లండని డాక్టర్లు సూచించారు. దీంతో పేషెంట్‌ తన బాధను మీడియాకు తెలిపాడు. ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా నిమ్స్ లో అప్పట్లో సుమారు లక్షన్నర వసూలు​చేసినట్లు బాధితుడు వాపోయాడు. ఇలా ఎంతో మంది పేషెంట్ల వద్ద నుంచి నిమ్స్​వసూలు దోపిడీకి పాల్పడుతున్నట్లు స్వయంగా అందులోని డాక్టర్లే చెబుతున్నారు.

గ్రూప్‌లు కట్టి.. సేవలు గాలికొదిలేసి..

నిమ్స్​డాక్టర్ల మధ్య విభేదాలే ప్రధాన కారణాలని చర్చలో ఉంది. మూడు నాలుగు గ్రూప్​లుగా విడిపోయి వైద్యసేవలను గాలికి వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ వర్గానికి నచ్చని విధంగా మరోవర్గం ప్రయత్నాలు చేస్తూ పేషెంట్ల ఇబ్బందులు కలిగిస్తున్నారు. పేదలకు కనీసం అడ్మిషన్లు కూడా లభించని పరిస్థితి ఉంది. ఓపీ నుంచి టెస్టులు వరకు స్టాఫ్​, డాక్టర్లు చుక్కలు చూపిస్తున్నారు. క్షేత్రస్థాయిలోని విషయాలను కొందరు డాక్టర్లు వివరించే ప్రయత్నం చేస్తున్నా హెచ్ వోడీలు స్పందించడం లేదని రెసిడెంట్​డాక్టర్లు పేర్కొంటున్నారు. కొందరి తప్పు అందరిపై చెడుగా పడుతుంది.

ఎమర్జెన్సీనా అంటూ..

ఇక సెక్యూరిటీ వ్యవస్థతోనే ఆస్పత్రికి చెడ్డపేరు వస్తున్నది. ఎమర్జెన్సీ వార్డుకు పేషెంట్లు వచ్చినా.. సెక్యూరిటీ గార్డులు అత్యవసరమా? కాదా? అని అంటున్నట్టు ఓ పేషెంట్ చెప్పారు. కార్​లో స్ట్రెచర్​మీద వస్తేనే ఎమర్జెన్సీగా గుర్తించి లోనికి పంపుతున్నారు. కొందరు సెక్యూరిటీ గార్డులు గాంధీ, ఉస్మానియాలకు వెళ్లాలని చెబుతున్నారు. మరోవైపు సెక్యూరిటీ గార్డులు చెప్పినోళ్లనే డాక్టర్లు కూడా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకోవడం విచిత్రంగా ఉంది. ఇక వాహనాల పార్కింగ్ లోనూ రోగులను ఇబ్బంది పెడుతున్నారు. భారీగా ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రశ్నించినోళ్లపై పార్కింగ్ స్టాఫ్​దాడులు చేసేందుకు కూడా వెనకాడటం లేదు.

Also Read...

జీహెచ్ఎంసీ పాట్లు.. ఆదాయం కోసం అన్వేషణ

Next Story

Most Viewed