గవర్నర్ శివప్రతాప్‌తో సీఎం రేవంత్ భేటీ.. ఆ మంత్రి గురించే కీలక చర్చ!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-19 06:38:45  IST  )

గవర్నర్ శివప్రతాప్‌తో సీఎం రేవంత్ భేటీ.. ఆ మంత్రి గురించే కీలక చర్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీ నామినేషన్ల ఫైల్‌పై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ భేటీ అత్యంత కీలకంగా మారింది. తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ పదవికి సంబంధించి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల లోపు ఏదో ఒక సభ (అసెంబ్లీ లేదా కౌన్సిల్)లో సభ్యుడిగా ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30వ తేదీకి సరిగ్గా ఆరు నెలలు పూర్తి కానున్నాయి. అంటే.. మరో పది రోజుల్లోపు ఆయన చట్టసభ సభ్యుడిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఫైల్‌పై ఉత్కంఠ

గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ప్రభుత్వం పంపిన ఫైల్ గత కొంతకాలంగా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉంది. ఈ ఫైల్‌లో అజారుద్దీన్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీ లోపు ఈ ఫైల్‌కు గవర్నర్ ఆమోదం తెలిపి, గెజిట్ విడుదల అయితేనే అజారుద్దీన్ మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్‌ను కలిసి, తాజా రాజకీయ పరిణామాలను వివరిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story