సింగరేణికి కొత్త ఊపిరులు.. నష్టాల నుంచి గట్టెక్కేలా సర్కార్ ప్లాన్!

by Kema Shiva Kumar |

గత పాలకుల వ్యూహాత్మక లోపాల వల్ల నష్టపోయిన ఘన చరిత్ర గల సింగరేణి సంస్థకు పునరుజ్జీవనం పోసేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

సింగరేణికి కొత్త ఊపిరులు.. నష్టాల నుంచి గట్టెక్కేలా సర్కార్ ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆర్థిక, పారిశ్రామిక రంగానికి ఊపిరిగా నిలిచిన సింగరేణి సంస్థ గత పదేళ్లలో దారుణంగా దెబ్బతిన్నది. 137 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ ప్రభుత్వ రంగ సంస్థ, స్వరాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయికి ఎదగాల్సింది పోయి వ్యూహాల లోపంతో గత పదేళ్లుగా తీవ్రంగా నష్టపోయింది. బొగ్గు మైనింగ్‌లో శతాబ్దానికి పైగా అనుభవం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కొత్త బొగ్గు బ్లాక్‌లు దక్కకుండా నాటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుపడిందనే ఆరోపణలున్నాయి. ఫలితంగా నేడు ప్రభుత్వ రంగ సంస్థలైన జెన్‌కో, సింగరేణి విస్తరణ పూర్తిగా స్తంభించిపోయింది.

సింగరేణిపై ఆంక్షలు..

కేంద్ర ప్రభుత్వం 2015లో దేశంలో బొగ్గు గనుల కేటాయింపునకు వేలం విధానాన్ని తెచ్చినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. సింగరేణికి ఒడిశాలో కేటాయించిన అత్యంత విలువైన బొగ్గు బ్లాక్‌ల విషయంలో నాటి పాలకులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారని, దీనివల్ల సింగరేణి సంస్థ తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంటూ ఒడిశాలోని కీలకమైన జేఎంటీ-3 బ్లాక్‌ను, నైనపల్లి బ్లాక్-3ను కోల్పోవాల్సి వచ్చిందని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కోయగూడెం బ్లాక్‌లో 119.60 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలుండగా.. దాదాపు 14ఏళ్ల పాటు గని కార్యకలాపాలను కొనసాగిచేందుకు అవకాశం ఉండేది. ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసే అవకాశం ఉంటుంది. ఇక సత్తుపల్లి బ్లాక్‌లో 69.65 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. 8ఏళ్లపాటు ఏటా 4మిలియన్ టన్నుల చొప్పున బొగ్గును తీసేందుకు అవకాశం ఉండేది. ఈ రెండింటిని కోల్పోవడం సింగరేణిపై భారీ ప్రభావాన్ని చూపింది. ఈ రెండు బ్లాక్‌లను నాటి ప్రభుత్వం ప్రైవేట్‌పరం అయ్యేలా రూపాంతరం చెందించడంతో ఇప్పటివరకు అక్కడ మైనింగ్ కార్యకలాపాలు మొదలు కాలేదు.

పాత గనులపై భారం..

రాష్ట్రం ఏర్పడే నాటికి సింగరేణిలో 48 గనులు, సుమారు 59 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. అయితే గత 10ఏళ్ల కాలంలో (2014-2023) కొత్త బొగ్గు బ్లాక్‌లు సాధించకపోవడంతో, ప్రస్తుతం ఉన్న గనుల నుంచే సామర్థ్యానికి మించి ఉత్పత్తి చేయాల్సి వస్తోంది. దీనివల్ల పాత గనుల్లో నిల్వలు హరించుకుపోయి 2022 డిసెంబర్ నాటికి గనుల సంఖ్య 48 నుంచి 40కు పడిపోయింది. రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట డిమాండ్ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2026 నాటికి అది 18,548 మెగావాట్లకు చేరింది. డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త గనులకు లీజులు తీసుకోకపోవడంతో అంతర్గత బొగ్గు కొరత ఏర్పడింది. కొత్తగా 4 వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్లు ప్రారంభించినా, వాటికి అవసరమైన బొగ్గు నిల్వలకు ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో జెన్‌కో ప్లాంట్లపై తీవ్ర ప్రభావం పడింది.

పునరుజ్జీవనం దిశగా..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి పునరుజ్జీవనానికి విప్లవాత్మక అడుగులు పడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక నిఘా పెట్టి కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధనపై దృష్టి పెట్టారు. సింగరేణి విస్తరణకు కీలకమైన శ్రావణపల్లి బ్లాక్-2 ను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అలాగే గతంలో ప్రైవేట్ పరమైన కాలయాపన, సత్తుపల్లి గనులను తిరిగి సింగరేణి పరిధిలోకి తేవడానికి చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతో 32 గనుల చొప్పున బ్లాక్‌ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. నాటి పాలకుల కుట్రల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుతూ సింగరేణిని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడానికి ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్ల బడ్జెట్ ప్లాన్‌తో ముమ్మర కసరత్తు చేస్తోంది.

Next Story