సార్లు దయతలిచి జీతాలు ఇప్పించగలరని మొక్కుతున్నా...

by Dishanational1 |
సార్లు దయతలిచి జీతాలు ఇప్పించగలరని మొక్కుతున్నా...
X

దిశ, వలిగొండ: గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందడంలేదు. దీంతో వారు అప్పుల చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి నెలా వేతనాల కోసం నిరీక్షిస్తున్నారు. ఉదయ నుంచి సాయంత్రం వరకు కష్టం చేస్తే వారికి నెలకు వచ్చేది రూ. 8,500 మాత్రమే. అదీ కూడా సక్రమంగా అందక సతమత మవుతున్నారు. కోడి కుయ్యకముందే గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామంలో వీధి వీధి తిరుగుతూ గ్రామ సమస్యలపై చర్చించుకుంటూ గ్రామంలో ఉండే పారిశుధ్య పనులు, వీది లైట్ల సమస్య, నీటి సమస్య లేకుండా చూసే గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం మాత్రం సమస్యలు తెచ్చిపెడుతోంది. గ్రామంలోని సమస్యలు పరిష్కరించలేని స్థితిలో ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బందిని కొత్త సమస్యలు చూపిస్తూ ప్రభుత్వం మాత్రం పెంచిన జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని పలువురు సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.

గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు నాలుగు నెలలు కావస్తున్నా జీతాలు అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి వీధులను శుభ్రం చేస్తూ తమ అనారోగ్యాలను లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కంపువాసనలో పనిచేస్తున్నారు. చాలీ చాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నప్పటికీ, నాలుగు నెలలుగా జీతాలు రాక కుటుంబాన్ని పోషించలేక, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. కనీసం కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైన ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి దాపురించింది. చిల్లి గవ్వలేక, పూట గడవక ఎలా జీవించాలని ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే గ్రామపంచాయతీల నుంచి కార్మికుల వేతనాల కోసం అధికారులు ఎస్టీవోలకు పంపించే చెక్కులకు ఇప్పటివరకు మోక్షం లభించలేదు. గ్రామపంచాయతీలు వసూలు చేసిన మొత్తాన్ని ఎస్టీవోలో జమ చేసినా కార్మికుల వేతనాలు మాత్రం విడుదల కావడం లేదు.

గ్రామపంచాయతీలో పారిశుధ్య సిబ్బంది నాలుగు నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. గ్రామాల్లో వీధులు శుభ్ర పర్చడం, మురికి కాలువలు తీయడం మొదలుకుని వీధి దీపాలు వేయడం, నర్సరీలో మొక్కలు పెంచడం, క్రిమిటోరియం గ్రామాల్లో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులో వేయటం లాంటి పనులు నిర్వహిస్తుంటారు. వచ్చిన వేతనంతో కుటుంబ పోషణ, ఇతర అవసరాలు తీర్చుకునేవారు. అయితే కొన్ని నెలలుగా వేతనాలు సరిగా అందకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల వేతనం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు అందజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పూట గడవడం లేదు: ఎల్లంకి స్వామి, పారిశుద్ధ్య కార్మికుడు

నాలుగు నెలల నుంచి జీతాలు అందక పూటగడవని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ పొద్దున్నే నాలుగు గంటలకు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి రెండు గంటల నుండి 5 గంటల వరకు పనిచేస్తూనే ఉన్నాం. కష్టం చేసినా జీతాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. సార్లు దయతలిచి జీతాలు ఇప్పించగలరని మొక్కుతున్నా.



Next Story

Most Viewed