భగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ విభేదాలు... రచ్చకెక్కిన వర్గపోరు

by Dishanational1 |
భగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ విభేదాలు... రచ్చకెక్కిన వర్గపోరు
X

దిశ, సూర్యాపేట ప్రతినిధి: హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కోదాడలో నిర్వహించిన నల్లగొండ పార్లమెంటరీ పార్టీ సమీక్షలో కాంగ్రెస్ పార్టీ విభేదాలు బుధవారం భగ్గుమన్నాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రామ్ ఠాక్రే సమక్షంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో సూర్యాపేట నియోజకవర్గ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని 2017 తర్వాత ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఠాక్రేకు ఫిర్యాదు చేయగా అదే సమయంలో అక్కడకు చేరుకున్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి ప్రవేశించగా వారిని మీటింగ్ హాల్ నుండి బయటకు పంపించారు. అదే సమయంలో అక్కడే ఉన్న నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ పరకాల వేణుగోపాల్ తో పటేల్ రమేష్ రెడ్డి, అతని అనుచరులు వాగ్వాదానికి దిగారు. సమీక్షా సమావేశంలో తమని అవమానపరిచేలా కామెంట్స్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు పార్టీలో సీనియర్ నాయకులంతా తమకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మీటింగ్ కు హాజరు కాని రేవంత్ వర్గం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం ఈ సమీక్షా సమావేశానికి హాజరు కాలేదు. నల్లగొండ పార్లమెంటరీ సమావేశం కొరకు 8 నియోజక వర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం అందించారు. వీరిలో రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన డాక్టర్ చెరుకు సుధాకర్, అద్దంకి దయాకర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, బీర్ల ఐలయ్య, బత్తుల లక్ష్మారెడ్డి హాజరు కాలేదు. వీరిని మీటింగ్ కు వెళ్ళొద్దని టీపీసీసీ నుండి ఒక నాయకుడు ఫోన్ చేసి చెప్పినట్లు కాంగ్రెస్ నేత తెలిపారు. దీంతో సమీక్షా సమావేశంలో ఉత్తమ్ వర్గానికి చెందిన నాయకులు మాత్రమే హాజరయ్యారు. ఒక్క సూర్యాపేట నియోజకవర్గం నుండి మాత్రమే రేవంత్ అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి పాల్గొనగా అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా పటేల్ వర్గం ఆందోళనకు దిగారు.



Next Story