ఎట్టకేలకు పోడు భూములకు పట్టాలు రెడీ

by Disha Web Desk 9 |
ఎట్టకేలకు పోడు భూములకు పట్టాలు రెడీ
X

దిశ, నల్లగొండ బ్యూరో: దాదాపు మూడు తరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు త్వరలో హక్కుపత్రాలు అందనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అదిగో ఇదిగో అంటూ ఊరించిన పాలకులు ఎట్టకేలకు పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు ఇప్పటికే ముద్రించారు. బహుశా వచ్చే నెలలో సీఎం కేసీఆర్ లేదా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గిరిజన, గిరిజనేతరులకు పోడు భూములకు పట్టాలు అందించనున్నట్లు సమాచారం. జిల్లాలో 55,703 ఎకరాల్లో పోడు భూములు ఉండగా 20,446 మంది రైతులు పట్టా పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 9 ఏళ్లుగా ఊరిస్తున్న పట్టాల పంపిణీకి ఎట్టకేలకు మోక్షం లభించనుండడంతో పోడుభూముల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలో దేవరకొండ డివిజన్లోని 6 మండలాలు దేవరకొండ, చందంపేట, డిండి, నేరేడు గొమ్మ , చింతపల్లి , పీఏ పల్లి , మిర్యాలగూడ డివిజన్లో ఏడు మండలాల కాగా మిర్యాలగూడ, అడవిదేవులపల్లి, త్రిపురారం , దామరచర్ల , తిరుమలగిరి సాగర్ , పెద్దవూర , నిడమనూరు , మండలాల్లో పోడు భూముల పట్టాల కోసం గిరిజన, గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు . 13 మండలాలు 160 మధిర గ్రామాలు, 120 గ్రామపంచాయతీలలో పోడు భూములు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది . సాగవుతున్న భూమి మొత్తం 55, 703ఎకరాలుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. మరికొద్ది రోజుల్లో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్నా గిరిజన, గిరిజనేతర రైతులకు పట్టాలిచ్చేందుకు సిద్ధం చేసింది.

నల్గొండ జిల్లాలో 20,466మంది దరఖాస్తులు..

కొన్నేళ్లుగా అటవీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది రెండోసారి అధికారంలోకి వచ్చాక మరింత సీరియస్ గా పోడు భూముల అంశంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఆయా భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 20,466 మంది ఉన్నారు. అందులో 15,417 మంది గిరిజనులు కాగా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు 5,029 మంది ఉన్నారు. సాగవుతున్న పోడు భూమి మొత్తం 55,703 ఎకరాలు గుర్తించారు. ఇందులో గిరిజనులు సాగులో ఉన్న భూమి 43,266 ఎకరాలు కాగా గిరిజనే తరులు 12,440 సాగులో ఉన్నారు.

2,608 పట్టా బుక్కులు సిద్ధం..

పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే సుమారు 2,608 మంది రైతులకు పట్టాలించేందుకు పాసుబుక్కులు సిద్ధంగా ఉన్నాయి. మరో 250 ప్రింటింగ్ ప్రెస్ లో రెడీగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంటే మొత్తంగా ఈనెల చివర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో సుమారు 2,900 మంది పోడు రైతులకు పాస్ బుక్కులు ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇందులో కూడా మొదటిదఫా మొత్తం గిరిజన రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సమస్యకు పరిష్కారం లభించిందని సంతోషంలో గిరిజనులు ఉన్నప్పటికీ కొద్ది మంది రైతులకు పట్టాలివ్వడం, మిగతా సుమారు 17,000 మందికి తర్వాత ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కానీ 9 ఏళ్లుగా ఊరిస్తున్న పట్టాల పంపిణీ కార్యక్రమం మిగతా పాస్ బుక్ ల కోసం ఎంతకాలం ఎదురుచూడాల్సి వస్తుందని పోడు రైతులు ఆవేదన చెందుతున్నారు.


Next Story