- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రూ.44 కోట్ల ప్రజా ధనం వృథానేనా..?

దిశ, వేములపల్లి: భీమారం-సూర్యాపేట రోడ్డుకు నిధులు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆ రోడ్డుపై ప్రయాణించే వారికి నరక ప్రాయంగా మారింది. పెద్ద గుంతలతోపాటు కంకర తేలి ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డు ప్రమాదాల బారిన పడి పలువురు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. అయినప్పటికీ అధికారుల్లో మార్పు రాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట నుంచి వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం సమీపంలోని అద్దంకి నార్కట్ పల్లి రహదారి వరకు 28 కిలోమీటర్ల డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు 8ఏళ్ల కింద నిధులు మంజూరయ్యాయి. ఏళ్లు గడిచినా పనులు పూర్తి కాకపోవడం నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా మారింది. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే రెండు జిల్లాలతోపాటు మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు తక్కువ సమయంలో ప్రయాణించడానికి వీలుంటుంది. ఈ మార్గం ద్వారా మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వందలాది వాహనాలు ప్రయాణిస్తున్నాయి. కానీ ఏళ్ల తరబడి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు పూర్తి అసహనానికి గురవుతున్నారు.
రూ.44కోట్ల ప్రజా ధనం వృథానేనా..?
భీమారం-సూర్యాపేట రోడ్డు నిర్మాణానికి రెండు విడుతలుగా సుమారు రూ.44కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయినప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ప్రభుత్వ నిధులన్నీ వృథా అయినట్లేనని మండల ప్రజలు వాపోతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రోడ్డు పనులు పూర్తికాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి విస్తరణ పనుల కోసం 2015లో నిధులు మంజూరు కాగా 2016లో రోడ్డు పనులను ప్రారంభించారు. సుమారు 28 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టడానికి మొదటి విడుతగా రూ.24కోట్లు, 2వ విడుతలో మరో రూ.20కోట్ల మంజూరయ్యాయి. ఈ నిర్మాణం చేపట్టడానికి కేఎంఆర్ గ్రూప్స్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. కాగా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు కూడా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పూర్తికాని కల్వర్టులు..
భీమారం-సూర్యాపేట రోడ్డు నిర్మాణంలో భాగంగా చేపట్టాల్సిన కల్వర్టుల ఆధునీకరణ ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. నిర్మాణంలో 9 బాక్స్ కల్వర్టులు ఉండగా, గూనల ద్వారా నిర్మించాల్సిన కల్వర్టులు 50కి పైగా ఉన్నాయి. బాక్సు బ్రిడ్జి నిర్మాణాల్లో ఆరు నిర్మాణాలు పూర్తి కాగా మరో మూడు పెండింగ్లో ఉన్నాయి. పూర్తయిన బ్రిడ్జిల వద్ద కూడా మట్టి పోయకపోవడంతో ప్రయాణికులు తాత్కాలిక రోడ్డుపై ప్రయాణించాల్సి వస్తుంది. గునల బ్రిడ్జిల 30 నిర్మాణాలు పూర్తి కాగా మరో 20 పెండింగ్ ఉన్నాయి. ప్రతి 5 కిలోమీటర్లకు ఒకచోట రోడ్డు తవ్వి గుంతలు ఏర్పడడంతో ప్రయాణానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రయాణికుల ఇబ్బందులు...
10ఏళ్లుగా రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల కంకర మాత్రమే పరిచి బీటీ వేయకపోవడంతో దుమ్ము లేచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు రోడ్డు ప్రమాదాల్లో గాయపడగా మరికొందరు మృతి చెందారు. రోడ్డును పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టకపోవడంతోపాటు కల్వర్టుల వద్ద గుంతలు ఏర్పడడం వల్ల రెండు రోజుల కింద మొలకపట్నం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.