ఉద్యాన పంటల సాగు లాభదాయకం

by Naveena |
ఉద్యాన పంటల సాగు లాభదాయకం
X

దిశ, చిట్యాల: ఆరుతడి పంటలైన ఉద్యాన పంటల సాగు రైతులకు లాభదాయకమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు. బుధవారం చిట్యాల పట్టణ కేంద్రంలోని కొంతం సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఆదర్శ రైతు సత్తిరెడ్డి సాంప్రదాయ పంటలైన వరి పైనే ఆధారపడకుండా ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించి అధిక లాభాలను అర్జించడం రైతులకు స్ఫూర్తిదాయకమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆయన సాగు చేస్తున్న పళ్ళ తోటలను, కూరగాయల తోటలను స్వయంగా పరిశీలించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ఉండేందుకు బిందు సేద్యం ద్వారా ఉద్యాన పంటలను సాగు చేయడం హర్షనీయమన్నారు.

జిల్లాలో ఉన్నటువంటి భూగర్భ జలాల కొరతను దృష్టిలో ఉంచుకొని రైతులు వానాకాలంలో వరి పంట పైనే కాకుండా మెట్ట పంటలపై దృష్టి సారించాలన్నారు. నీటి ఎద్దడి సమస్యను అధిగమించేందుకు వ్యవసాయ క్షేత్రాలలో ఫాం పాండులను రైతులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆమెతో పాటు తాసిల్దార్ కృష్ణ నాయక్, ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి పి. గిరిబాబు ఉద్యానవన అధికారి, తదితరులు పాల్గొన్నారు.



Next Story