నిధుల లేమితో నిలిచిన నిర్మాణం

by Disha Web Desk 12 |
నిధుల లేమితో నిలిచిన నిర్మాణం
X

దిశ, హాలియా: రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు చేపట్టిన పలు ప్రభుత్వ భవనాలు నిధులకు గ్రహణం పట్టడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. ప్రధానంగా హాలియా మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ భవన నిర్మాణం నిధుల లేమితో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. స్పెషల్ డెవలప్మెంట్ గ్రాండ్ రూ.2 కోట్ల రూపాయలతో చేపడుతున్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ భవన నిర్మాణం పనులు ముందుకు సాగేందుకు గ్రహణం పట్టిందని ఆరోపణలు వస్తున్నాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హాలియా మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆయా గ్రాంట్ల కింద మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం, డ్రైన్లు సెంట్రల్ లైటింగ్, ఆడిటోరియం, వైకుంఠధామం తదితర పనులకు శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా స్పెషల్ గ్రాంట్ కింద చేపట్టిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ భవన నిర్మాణం నిధుల కొరతతో సంబంధిత కాంట్రాక్టర్ నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. గత ప్రభుత్వంలో ఆరు నెలల్లోనే భవన నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ప్రారంభిస్తామన్న హామీలు నీటిమట్టలయ్యాయి. సమీకృత భవన నిర్మాణానికి రూ.2కోట్లు ప్రతిపాదించినప్పటికీ ఇప్పటివరకు కేవలం రూ.30 లక్షల రూపాయలు మాత్రమే ప్రభుత్వ నిధుల నుండి విడుదలైనట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.1.30 కోట్ల పనులు పూర్తి చేశామని నిధులు రాకపోవడంతో పనులు నిలిపివేసినట్లు అధికారులు పేర్కొనడం గమనార్హం.

గత ప్రభుత్వంలో వెజిటేబుల్ మార్కెట్ కోసం హాలియా లోని సాగర్ రోడ్డులో గల పేరూరు మేజర్ వద్ద వెజిటబుల్ మార్కెట్ ఏర్పాటు చేయాలన్న పట్టణ ప్రజల ఆలోచన గత ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల ఆలోచనలు చేసినప్పటికీ ఇండోర్ స్టేడియం సమీపంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం నిర్మించాలన్న ఆలోచన విమర్శలకు తావిచ్చింది. పట్టణంలో ఇప్పటికే చిరు వ్యాపారులు వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయి అంటూ ఓవైపు పెదవి విరుస్తున్నప్పటికీ పట్టణానికి దూరంగా ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ భవనం నిర్మాణం చేయడం పట్ల చిరు వ్యాపారులు విముఖంగా ఉన్నారు. గతంలో ఎడమ కాలువ వద్ద రైతు బజార్ నిర్మించాలన్న సంకల్పం గత ప్రభుత్వాలు చేసినప్పటికీ విఫలం కావడంతో చిరు వ్యాపారులు ప్రధాన కూడళ్లలోనే వ్యాపారాలు చేసుకుంటున్నారు.

హాలియాకు రైతు బజార్ ఏర్పాటు కలేనా...?

దిన దినాభివృద్ధి చెందుతున్న హాలియా పట్టణంలో రైతు బజార్ లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా ఆదివారం సంత సమయంలో చిరు వ్యాపారులు ప్రధాన రహదారి పైనే వ్యాపారాలు సాగిస్తుండడంతో ఓవైపు ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు వ్యాపారాలకు విఘాతంగా మారింది. అంగడి బజార్లో వ్యాపారులు రహదారికి ఇరువైపులా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో చిరు వ్యాపారస్తులు తమ వ్యాపారాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

చిరు వ్యాపారాలు ఏటా రూ.లక్షలాది రూపాయల కిరాయిలు వెచ్చించి దుకాణాలను కిరాయిలకు తీసుకోవాల్సి వస్తుందని వీటి ద్వారా తమకు వచ్చిన కొంత ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని పలుమార్లు ఆవేదనలకు లోనయ్యారు. ప్రభుత్వం చిరు వ్యాపారులకు పట్టణ ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని రైతు బజార్ ఏర్పాటు చేసినట్లయితే మరింత సౌకర్యం వంతంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.




Next Story

Most Viewed