జిల్లాలో నకిలీ విత్తనాల కలకలం..

by Disha Web Desk 20 |
జిల్లాలో నకిలీ విత్తనాల కలకలం..
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : ఆరుగాలం శ్రమించి ప్రజల కంచంలోకి నాలుగు మెతుకులు వేసే రైతన్నకు కష్టాల మీద కష్టాలు ఎదురవుతున్నాయి. అకాల వర్షాలు, వడ్ల కొనుగోలు ఆలస్యం, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించే సమస్యలు ఒక ఎత్తు అయితే జిల్లా రైతులకు నకిలీ విత్తనాల సరఫరా మరింత తల భారంగా మారింది. జిల్లాలో శనివారం నకిలీ విత్తనాలు కలకలం చెలరేగింది. జిల్లా కేంద్రంలో విత్తనాలు కొనుగోలు చేసిన రైతు సరిగా మొలకెత్తలేదని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.

ఐదు రోజులైనా మొలకెత్తలే..

భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన కొమ్మిడి సత్తిరెడ్డి అనే రైతు ఈనెల 10వ తేదీన ధాన్యం విత్తనాలు కొనుగోలు చేశాడు. పదవ తేదీ 11వ తేదీ రెండు రోజులు చేసి విత్తనాలను ఆరబెట్టి శుద్ధి చేసి నానబెట్టాడు. మూడు రోజుల తర్వాత విత్తనాలు మొలకెత్తాయా లేదా అని పరిశీలించాడు. సరిగ్గా మొలకలు రాకపోవడంతో మరో రెండు రోజులు వేచి చూశాడు. అయినా మొలకలు సరిగ్గా రాకపోవడంతో నకిలీ విత్తనాలుగా భావించి విత్తనాలు అమ్మినటువంటి షాపు యజమానిని ప్రశ్నించగా నేనేం చేయలేను... నాకు సంబంధం లేదు అని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు. దీంతో వాటిని తీసుకుని భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.

కేసు తీసుకోలే.. అధికారులు స్పందించలే..

నకిలీ విత్తనాలు అన్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. డ్యూటీలో ఉన్న ఎస్ఐ మాట్లాడి వివరాలు తెలుసుకొని అగ్రికల్చర్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వారి పరిధిలో లేని అంశం తాము కేసు చేయలేమని స్పష్టం చేసి పంపించారు. ఈ విషయంపై డ్యూటీలో ఉన్న ఎస్సై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మండల అగ్రికల్చర్ అధికారులకు ఫోన్ చేసిన వారు స్పందించలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సదరు షాపు యజమాని పై చర్యలు తీసుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.



Next Story

Most Viewed