ఎగ్జామ్స్ పై మోడీ లెక్చర్ ఇచ్చారు.. నా కుమారుడికి పరీక్షలు ఉన్నాయి బెయిలివ్వండి.. కోర్టును కోరిన కవిత

by Disha Web Desk 13 |
ఎగ్జామ్స్ పై మోడీ లెక్చర్ ఇచ్చారు.. నా కుమారుడికి పరీక్షలు ఉన్నాయి బెయిలివ్వండి.. కోర్టును కోరిన కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై గురువారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇరువైపుల లాయర్లు తమ వాదనలు వినిపించారు. కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామని కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టును కోరారు. కవిత అరెస్ట్ తో కుమారుడును మానసికంగా కుంగిపోయాడని, పరీక్షలకు గైర్హాజరయ్యే అవకాశం ఉందని పరీక్షల సమయంలో తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తండ్రి ఉన్నప్పటికీ తల్లి పాత్రను ఆయన భర్తీ చేయలేరని అందువల్ల పరీక్షల సందర్భంగా తల్లి మద్దతు పిల్లలకు అవసరం అని అన్నారు. ప్రధాని మోడీ సైతం చాలా సందర్భాలలో పిల్లల పరీక్షల సన్నద్ధతపై లెక్చర్ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నందున పీఎంఎల్ఏ సెక్షన్ 45, మహిళగా కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈసందర్భంగా ప్రీతి చంద్రా, సౌమ్య చౌరసియా, సంజయ్ సింగ్ జడ్జిమెంట్ ను అభిషేక్ మను సింఘ్వీ ప్రస్తావించారు. షరతులతో కూడిన బెయిల్ కు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు.

బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షాలు ప్రభావితం:

ఈడీ తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ కవిత చిన్నకొడుకు ఒంటరిగా ఏం లేడని, 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు, కానీ పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయని కోర్టు దృష్టికి తీసుకోచ్చారు.కవితను ఆమె ముగ్గురు సిస్టర్స్ ములాఖత్ అయ్యారని చెప్పారు. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని, బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపారు. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని, లిక్కర్ కేసు ప్లాన్ చేసింది కవితే అన్నారు. ఫోన్ డేటాను డిలీట్ చేశారని దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మొత్తం 10 ఫోన్లు కవిత ఇచ్చారు, కానీ అవి ఫార్మాట్ చేసినవే అని నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని వాదించారు. ఈ కేసులోని నిందితులు వందల డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారని, అప్రూవల్ గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను ఈడీ తరపు న్యాయవాది జడ్జికి సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.



Next Story