ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. గద్వాల ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-23 04:51:02  IST  )

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. గద్వాల ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Prasad Kumar) చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ మేరకు బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరారంటూ స్పీకర్ తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ (MLA Krishna Mohan Reddy) రెడ్డికి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందినట్లుగా సమాచారం. అయితే, స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు వచ్చిన నోటీసులకు త్వరలోనే సమాధానమిస్తానని అన్నారు. తాను అసలు పార్టీ మారలేదని.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

కాగా, బీఆర్ఎస్ (BRS) పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ (KTR), ఆ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ (Justice BR Gavai), జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ (Justice Augustine George Masih) ధర్మాసనం జూలై 31న తుది తీర్పును వెలువరించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ప్రభుత్వంలో ఉన్న ఎవరూ ఆటంకాలు కలిగించోద్దని కోర్టు కామెంట్ చేసింది. సాకులు చెప్పి విచారణను ఇంకా వాయిదా వేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఒకవేళ అలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని అభిప్రాయపడింది. ఏదో ఒకరోజు ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహరంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ (High Court Division Bench) ఇచ్చిన తీర్పును కూడా డిస్మిస్ చేసింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల అనర్హతపై భారత పార్లమెంట్‌ (Indian Parliament)లో ఓ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story