రాష్ట్రం బియ్యం ఎగుమతులకు కేంద్ర బింధువు కావాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Ajay Maddhiboyina |

దేశంలో తెలంగాణను వరి ఉత్పత్తి రాష్ట్రంగా నిలిపిన తర్వాత, బియ్యం ఎగుమతులు, ఆధునిక సాంకేతికతలు, విలువ ఆధారిత ఉత్పత్తుల రంగంలో కూడా ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రం బియ్యం ఎగుమతులకు కేంద్ర బింధువు కావాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

హైదరాబాద్, జూన్ 6: దేశంలో తెలంగాణను వరి ఉత్పత్తి రాష్ట్రంగా నిలిపిన తర్వాత, బియ్యం ఎగుమతులు, ఆధునిక సాంకేతికతలు, విలువ ఆధారిత ఉత్పత్తుల రంగంలో కూడా ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రైస్ మిల్లర్లు కీలక భాగస్వాములని రైతులు, మిల్లర్లు, వినియోగదారులు అందరూ కలిసి అభివృద్ధి ఫలాలను పొందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ రైస్ అండ్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్‌పో-2026లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బియ్యం ఎగుమతులను పెంచేందుకు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు అయ్యే ఎగుమతి ఆధారిత రైస్ మిల్లులకు, ప్రస్తుతం పనిచేస్తున్న మిల్లులు ఎగుమతుల వైపు మళ్లేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. యాంత్రీకరణ ద్వారానే భవిష్యత్ అభివృద్ధి ఉందని, రైస్ మిల్లింగ్ రంగంలో కార్మికుల కొరత ప్రధాన సవాలుగా మారిందని యాంత్రీకరణ, ఆటోమేషన్‌కు మిల్లర్లు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా ఉత్పాదకత పెరగడంతో పాటు కార్మికుల కొరత సమస్యను అధిగమించవచ్చన్నారు. స్టీల్ సైలోలు, ఆటోమేటెడ్ గోదాములు, కృత్రిమ మేధస్సు ఆధారిత ధాన్య పర్యవేక్షణ వ్యవస్థలు, డిజిటల్ ఇన్వెంటరీ నిర్వహణ వంటి ఆధునిక నిల్వ సదుపాయాల నిర్మాణం అత్యవసరమన్నారు. ప్రజా-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో భారీ సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆహ్వానించారు. పార్బాయిలింగ్ యూనిట్లలో నీటి వినియోగాన్ని తగ్గించే, విద్యుత్ ఆదా చేసే ఆధునిక సాంకేతికతలను పరిశ్రమలు అవలంబించాలని సూచించారు. భవిష్యత్ ప్రాసెసింగ్ యూనిట్లు నీటి పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నాణ్యతతో పాటు పోషక విలువలను కూడా దృష్టిలో ఉంచుకుని బియ్యం ప్రాసెసింగ్ జరగాలన్నారు. నియంత్రిత వైటనింగ్, ప్రిసిషన్ పాలిషింగ్, పోషకాలను కాపాడే సాంకేతికతలు, ఏఐ ఆధారిత నాణ్యత నిర్ధారణ విధానాలు వినియోగదారులకు మరింత ఆరోగ్యకరమైన బియ్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

వరి కొనుగోళ్లలో తెలంగాణ వాటా 60 శాతం ఉంది :

ప్రస్తుతం తెలంగాణలో ఏటా సుమారు 300 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరుగుతోందని, దేశంలో యాసంగి వరి కొనుగోళ్లలో తెలంగాణ వాటా దాదాపు 60 శాతం ఉందన్నారు. ప్రస్తుత ఖరీఫ్, యాసంగి సీజన్లలో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం దాదాపు రూ.39 వేల కోట్లు జమ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు రూ.96 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకం ద్వారా 3.2 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోందని, ఇందుకోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.రైతులు, మిల్లర్లు, సాంకేతిక నిపుణులు, విధాన రూపకర్తలు సమష్టిగా కృషి చేస్తే తెలంగాణ బియ్యం ఉత్పత్తిలోనే కాకుండా, బియ్యం సాంకేతికత, ఆవిష్కరణలు, ఎగుమతుల రంగంలో కూడా ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభాం వ్యక్తం చేశారు.

Next Story