వర్క్ కల్చర్‌లో మార్పు వచ్చింది: శ్రీధర్ బాబు

by Gantepaka Srikanth |

తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో... త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.

వర్క్ కల్చర్‌లో మార్పు వచ్చింది: శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో... త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని మరింత పరుగులు పెట్టించేలా, పెట్టుబడిదారులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా అందరితో చర్చించి ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తామన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో 'ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ)' ఆధ్వర్యంలో నిర్వహించిన "గ్రోత్ ఎక్స్ 2026(Growth x 2026)" సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గ్రోత్ అంటే యాదృఛ్చికంగా వచ్చేది కాదని, భావి తరాల భవిష్యత్తు కోసం శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం "తెలంగాణ విజన్ 2047"ను రూపొందించిందన్నారు.

వర్క్ కల్చర్‌లో మార్పు వచ్చింది..

ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణను, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే తమ లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనకు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి "క్యూర్ - ప్యూర్ - రేర్" అనే త్రిముఖ వ్యూహానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నామన్నారు. నగరం నుంచి గ్రామం వరకు ప్రతి ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ అజెండా అని స్పష్టం చేశారు. ఏఐ, ఇండస్ట్రీ 5.0 లాంటి టెక్నాలజీస్‌తో వర్క్ కల్చర్‌లో మార్పు వచ్చిందని, రాబోయే రోజుల్లో కంపెనీల కంటే "ఎకో సిస్టం"కే ప్రాధాన్యత ఉంటుందని మంత్రి అన్నారు. అందుకే.. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దానినే నిర్మించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. పరిశ్రమలకు కేవలం అనుమతులు ఇచ్చే వ్యవస్థలా కాకుండా, వారితో కలిసి నడిచే భాగస్వామిగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ప్రముఖ వైద్యులు డా.నాగేశ్వర్ రెడ్డి, ఫ్యాప్సీ ప్రెసిడెంట్ ఆర్.రవి కుమార్, స్కై రూట్ ఏరో స్పేస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్ 2026 కన్వీనర్ పంకజ్ దివాన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story