తెలంగాణను మూడు జోన్‌లుగా విభజిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

ప్రపంచంలోనే అత్యుత్తమ వాటితో పోటీపడేలా మేక్ ఇన్ సౌత్, స్కేల్ ఫర్ ది వరల్డ్ ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పిలుపునిచ్చారు.

తెలంగాణను మూడు జోన్‌లుగా విభజిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలోనే అత్యుత్తమ వాటితో పోటీపడేలా మేక్ ఇన్ సౌత్, స్కేల్ ఫర్ ది వరల్డ్ ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం దృష్టిలో జీడీపీ అంటే కేవలం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కాదని, గ్రాస్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్(జీఈపీ) అని అన్నారు. శుక్రవారం బేగంపేట్‌లోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశంలో ‘డ్రైవింగ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్, తెలంగాణ రోడ్ మ్యాప్ టూ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ’ అనే అంశంపై ఆయన కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ ‘15’ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే ప్రయాణంలో తెలంగాణను కీలక భాగస్వామిగా మార్చుతామన్నారు. అర్బన్ ఇంజిన్, ఇండస్ట్రియల్ హార్ట్ ల్యాండ్, రూరల్ ట్రాన్ఫ్సర్మేషన్ జోన్ అనే మూడు మూల స్థంభాలుగా తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని వివరించారు.

అమలులో వేగం, అవకాశాలలో పారదర్శకత, రూపకల్పనలో ఫ్యూచర్-రెడీగా ఉండే కొత్త అభివృద్ధి నమూనాకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. 2035 నాటికి హైదరాబాద్ జీడీపీ 350 బిలియన్ డాలర్లకు చేరేలా సర్వీసెస్, సస్టైనబిలిటీ, స్మార్ట్ లివింగ్‌కు గ్లోబల్ క్యాపిటల్, నెట్-జీరో ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని గ్లోబల్ చైనా + 1 అవకాశాన్ని అందిపుచ్చుకునేలా కీలకమైన పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి రైతును పారిశ్రామికవేత్తగా మార్చేలా అగ్రి ప్రాసెసింగ్ క్లస్టర్లు, డిజిటల్ అనుసంధానం కలిగిన ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేస్తామన్నారు. ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ సిటీ, ఇమేజ్ టవర్స్, టీ-హబ్ ఫేజ్ 2 ద్వారా రాష్ట్రంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మరింత పటిష్ఠమవుతుందన్నారు. రాష్ట్రంలో 2030 నాటికి ‘20 గిగావాట్స్’ పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విశ్వసనీయమైన లాంచ్ ప్యాడ్‌గా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఏపీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ థామస్ జాన్ ముత్తూట్, డిప్యూటీ చైర్మన్ రవిచంద్రన్, సీఐఐ తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ శివప్రసాద్‌రెడ్డి, వైస్ చైర్మన్ గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story