మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు అమలు.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Dishafeatures2 |
మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు అమలు.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో శనివారం ఆమె వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్‌-కమ్‌ హెల్పర్లకు లబ్ధిచేకూరుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం ద్వారా సంవత్సరానికి రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధుల్ని ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని, పర్యవేక్షణ పెంచాలని అధికారులకు సూచించారు. పాఠశాల విద్యలో ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారీగా భాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్ లెవెల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.కోటి కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు(ఎస్ఎంసీ) అప్పగించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన యూనిఫాంలు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed