రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు.. Minister Niranjan Reddy

by Dishafeatures2 |
రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు..  Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెరిగిన ఆయకట్టుకు అనుగుణంగా కాలువలు ఉండాలని, రైతులకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాలువలకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ 5, డిస్ట్రిబ్యూటరీ 8 కాలువలను రీ డిజైన్ చేసి ప్రతిపాదనలు పంపాలని కోరారు. కల్వకుర్తి కాలువ ప్యాకేజీ 29 కింద ఉన్న డి1, డి3, డి5, డి6 మరియు డి8 కాలువల పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.

వానాకాలం, యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరివ్వాలని, డిస్ట్రిబ్యూటరీ 5, డిస్ట్రిబ్యూటరీ 8 కాలువల మీద గతంలో ఎదురయిన ఇబ్బందులు మళ్లీ రాకుండా చూడాలన్నారు. డిస్ట్రిబ్యూటరీ 5 కాలువ వెడల్పు చేసి చివరి ఆయకట్టుకు నీరందేలా చూడాలని చెప్పారు .డిస్ట్రిబ్యూటరీ 8లో పెరిగిన ఆయకట్టుకు అనుగుణంగా కాలువ రీ డిజైన్ మరియు లైనింగ్ చేసుకోవాలని తెలిపారు.

చెరువులు అన్నింటికీ కాలువలను అనుసంధానం చేయాలి. చెరువులను పటిష్టం చేయాలన్నారు. కాలువల నిర్వహణ దృష్ట్యా ప్రతి కాలువ మీద ఇంజనీర్లకు విధులు అప్పగించాలని తెలిపారు. మామిడిమాడ రిజర్వాయర్ లో 30 శాతం మేర నీళ్లు నింపాలని, ఆయకట్టుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణపసముద్రం పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. గణపసముద్రం, బుద్దారం రిజర్వాయర్ లైన్ అలైట్ మెంట్ పూర్తిచెయ్యాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఈ రఘునాధరావు, ఎస్ఈ సత్యశీలారెడ్డి, ఈఈలు వెంకట్ రెడ్డి, మధుసూధన్ రావు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed