తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం సవతితల్లి ప్రేమ: కేటీఆర్

by Disha Web Desk 2 |
తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం సవతితల్లి ప్రేమ: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వకుండా కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్రం పేర్కొనడంపై మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. అత్యంత రద్దీ కలిగిన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ దశ సాధ్యం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన నగరాలకు మాత్రం పక్షపాత ధోరణితో మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇస్తున్న విషయాన్ని లేఖలో ఎత్తిచూపారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతోపాటు చాలా తక్కువ జనాభా కలిగిన లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్, మీరట్ వంటి ఉత్తరప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను కేంద్రం కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు.

జనాభా రద్దీ తక్కువగా ఉన్న ఇలాంటి నగరాలకు మెట్రో రైల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్న కేంద్రం, హైదరాబాద్ నగరానికి మాత్రం మెట్రో రైల్ విస్తరణ అర్హత లేదని చెప్పడం తనకు అత్యంత ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా హైదరాబాద్ ఉన్నదని ఇలాంటి నగరంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాదన అర్ధరహితం అన్నారు. యూపీలోని అనేక చిన్న నగరాలు, పట్టణాలు మెట్రో రైల్ ప్రాజెక్టులకు అర్హత సాధించినప్పుడు హైదరాబాద్ మెట్రో నగరానికి మాత్రం ఎందుకు ఆ అర్హత పొందదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వం పక్షపాత దృక్పథంతో తీసుకున్న నిర్ణయమేఅన్నారు. కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అన్నారు.

ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి శాఖకు మెట్రో రైల్ రెండవ దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించడంతోపాటు డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ (డీపీఆర్) సైతం అందించామన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, పీహెచ్పిడిటీ గణాంకాలు, ఇతర అర్హతలను, సానుకూలతలను అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకువచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని రకాల సమాచారం అందించినా, తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెబుతున్న నేపథ్యంలో మరోసారి సమగ్ర సమాచారాన్ని, అన్ని రకాల పత్రాలను నివేదికలను కేంద్రానికి పంపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరిని మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ దశ ప్రాధాన్యతను వివరించేందుకు అనేకసార్లు ప్రయత్నించినా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హైదరాబాద్ నగర మౌలిక వసతుల ప్రాజెక్టులు విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా, అవసరాలే ప్రాతిపదికగా సరైన నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రాజెక్టులు కేటాయిస్తారని ఆశించిన్నట్లు తెలిపారు. అయినప్పటికీ హైదరాబాద్ నగర మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశ ప్రతిపాదనలో ఉన్న సానుకూలతలను దృష్టిలో ఉంచుకొని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నట్లు, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు, అవసరమైన సమాచారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed