మంచిపనిచేయకపోతే ఇంటికే : మంత్రి కేటీఆర్

by Dishanational2 |
మంచిపనిచేయకపోతే ఇంటికే : మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మంచిపనిచేస్తేనే ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారని.. లేకుంటే ఇంటికి పంపుతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంచిఎప్పటికీ గుర్తుంటాయని.. మనిషి భూమిమీద ఉన్నన్ని రోజులు సమస్యలు ఉంటూనే ఉంటాయని.. సాధ్యమైనంతవరకు పరిష్కరిస్తూ ముందుకు సాగాలన్నారు. ఎన్నిక‌ల్లో గెల‌వాల‌నే ఆరాటంతో అనేక హామీలు ఇస్తామని, ఆ హామీల‌ను నెర‌వేర్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్పష్టం చేశారు. రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శుక్రవారం పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో ఉత్తమ పంచాయతీ అవార్డులు ప్రధానోత్సవంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. స‌ర్పంచ్ నుంచి సీఎం వ‌ర‌కు స‌మ‌ర్థమైన నాయ‌క‌త్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమ‌వుతుంద‌న్నారు. ప్రజాప్రతినిధులు స‌మ‌న్వయంతో ప‌ని చేయ‌క‌పోతే అభివృద్ధి జ‌ర‌గ‌ద‌న్నారు.

పంచాయతీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ-పంచాయతీ అని స్టార్ట్ చేశానని, అది ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 12769 గ్రామాలకు కంప్యూటర్ లు,ప్రింటర్లు ఇస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ నేప‌థ్యం గురించి త‌న‌కు చాలా త‌క్కువ తెలుసు అన్నారు. ఎంపీటీసీలు గ్రామాల‌కు మండ‌లానికి, జ‌డ్పీటీసీలు మండ‌లానికి,జిల్లా ప‌రిష‌త్‌కు మ‌ధ్య స‌మ‌న్వయ‌క‌ర్తగా ఉండాలన్నారు. ఐదంచెల వ్యవ‌స్థ గురించి తెలుసుకోనంత వరకు ప్రజాప్రతినిధులైనా, వ్యవ‌స్థ అయినా ఎక్కడ వేసినా గొంగ‌డి అక్కడే అన్న చందంగా ఉంటుందన్నారు.

పంచాయ‌తీ సెక్రట‌రీ పోస్టు ఖాళీ అయితే త‌క్షణ‌మే భ‌ర్తీ చేయాల‌ని క‌లెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రజ‌ల వ‌ద్దకు పాల‌న తీసుకుపోవాల‌నే సంక‌ల్పం ఉండాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర ఏర్పాటుతోనే వికేంద్రీక‌ర‌ణ ఆగ‌లేదని, 10 జిల్లాల‌ను 33 జిల్లాలుగా మార్చుకున్నామని, 142 మున్సిపాలిటీలు, 12,769 గ్రామ పంచాయ‌తీలు ఉండటంతో సూక్ష్మంగా ప‌ని చేసేందుకు వీలు క‌లిగిందన్నారు. వికేంద్రీక‌ర‌ణతో వేగంగా ప‌నులు జ‌రుగుతాయన్నారు. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ..మరోవైపు పరిశ్రమల స్థాపనచేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా హరితహారంలో 7.7 గ్రీన్ కవర్ తెలంగాణలో మాత్రమే పెరిగిందన్నారు. కేంద్రం 15 ఆర్ధిక సంఘం నిధులు రాకుండా ఆపేసిందని మండిపడ్డారు. ఇండియా లో 13 రాష్ట్రాల్లో అవినీతి పై చేసిన సర్వేలో తెలంగాణలో అత్యంత తక్కువగా ఉందని తేల్చారన్నారు. ఇంటింటికీ తాగు,సాగు నీరు,ప్రతి గ్రామానికి ట్రాక్టర్ లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Next Story