ఆ కార్యాలయాలు కూల్చేస్తాం.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
ఆ కార్యాలయాలు కూల్చేస్తాం.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎల్‌పీ కార్యాలయాలు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. త్వరలో కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణం చేపడుతామని, పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సచివాలయంలో రోడ్లు, భవనాలు (ఆర్‌అండ్‌బీ) శాఖ మంత్రిగా ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 9 దస్త్రాలపై సంతకాలు చేశారు. వీటిలో నల్గొండ నుంచి ధర్మాపురం, ముషంపల్లి రహదారిని 4 లైన్‌లుగా చేయడం, కొడంగల్, దుడ్యాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన దస్త్రాలు ఉన్నాయి. రానున్న రెండు లేదా మూడేళ్లలో రహదారుల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.

గత పదేళ్లుగా రహదారులపై కేసీఆర్ సర్కార్ శ్రద్ధ పెట్టలేదన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా రహదారుల మెరుగుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి అడుగుతామన్నారు. ప్రాంతీయ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ సౌత్‌ను జాతీయ రహదారిగా గుర్తించాలని కోరనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విజయవాడ - హైదరాబాద్ రహదారిని ఆరు లైన్లకు, హైదరాబాద్ - కల్వకుర్తి 4 లైన్‌లకు, సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్)ని పెంచాలని అడుగుతామన్నారు. ఈ 9 దస్త్రాల్లో ఐదింటి అనుమతికి రేపు గడ్కరీని కలుస్తానని చెప్పారు. భువనగిరి ఎంపీ పదవికి కూడా రేపు రాజీనామా చేస్తానని అన్నారు. హైదరాబాద్ - విజయవాడ రహదారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రెండున్నర గంటల్లో విజయవాడ చేరుకునేలా విస్తరిస్తామని హామీ ఇచ్చారు.

2 రోజుల్లోనే ఏం చేశారని హరీశ్‌రావు మాట్లాడుతున్నారు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఏం చేశారని హరీశ్‌రావు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దాదాపు పదేళ్లుగా బీఆర్ఎస్ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రహదారుల మీద శ్రద్ధ పెట్టలేదన్నారు. ఎవరి మీదా కూడా కావాలని కక్ష సాధించమన్నారు. తప్పులు ఉంటే వాటిపై చర్యలు తీసుకుంటామని కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed