భద్రాద్రి భూములు కాపాడుతాం.. AP సర్కార్​ సహకరించాలే: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by Disha Web Desk 19 |
భద్రాద్రి భూములు కాపాడుతాం.. AP సర్కార్​ సహకరించాలే: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: భద్రాద్రి భూములు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు.భద్రాద్రి భూములు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన దేవాదాయ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఏపీలోని పురుషోత్తం పట్నంలోని భద్రాద్రి ఆలయ భూములు సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్కడి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని, ఏపీ ప్రభుత్వం సహకరించాలన్నారు.

అన్యాక్రాంతమైన దేవదాయ భూములను తిరిగి రాబట్టే విషయంపై ప్రత్యేక దృష్టి సారించామ‌ని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు స్పెష‌ల్ డ్రైవ్ ద్వారా దాదాపు 6002 ఎక‌రాల‌ను తిరిగి స్వాధీనం చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఇక తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను దేవాదాయ వాఖ త‌ర‌పున ఘ‌నంగా నిర్వహించాలని ఆధికారులను ఆదేశించారు. ప్రతి ఆలయంలోనూ ఆధ్మాత్మిక శోభ వెల్లివిరిసేలా కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని సూచించారు.

మరోవైపు భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండే దేవాదాయ శాఖపై కొంత మంది అబద్ధాలతో బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, ఏ చిన్న పొరపాట్లకూ తావివ్వకుండా బాధ్యతగా పనిచేయాలని ఎండోమెంట్‌ అధికారులను ఆదేశించారు. ఆల‌యాల ఆదాయాన్ని ఆల‌యాల అభివృద్ధికే కేటాయిస్తున్నామ‌ని, ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ప్రభుత్వమే ప్రధాన ఆల‌యాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుంద‌ని స్పష్టం చేశారు. యాదాద్రిలో భ‌క్తుల‌కు వ‌స‌తులు పెంచాలన్నారు. భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రత్యేక చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.

క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణంలో వేచి ఉన్న అన్ని సమయాలలో భక్తులకు మంచినీరు అందించాల‌ని మంత్రి సూచించారు. అదేవిధంగా భక్తులు ఎండవేడిమి నుంచి సేద తీరేవిధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వసతుల కల్పనలో ఆలస్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, అద‌న‌పు క‌మిష‌నర్లు జ్యోతి, కృష్ణవేణి, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్లు, సత్యవతి, వ‌ల్లినాయ‌గం, ఈఈ, డీఈలు పాల్గొన్నారు.


Next Story