పదవికి రాజీనామా: మంత్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీపీ

by Web Desk |
పదవికి రాజీనామా: మంత్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీపీ
X

దిశ, మేడ్చల్ టౌన్: పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసేవలో కొనసాగుతామని ఎంపీపీ పద్మా జగన్ రెడ్డి అన్నారు. మంత్రి మల్లారెడ్డికి ఇచ్చిన మాట మేరకు ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తున్న సందర్భంగా తన స్వగ్రామమైన గౌడవెల్లిలో సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం.. పదవి నుంచి గౌరవంగా తప్పుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నడంతో పాటు ప్రజాసేవలో నిమగ్నమవుతానని తెలిపారు. కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందన్నారు. కష్టపడే నాయకులు, కార్యకర్తలకు మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ఇకనుంచి గౌడవెల్లి గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అభివృద్ధి కోసం పాటుపడతానని అన్నారు. ఎంపీటీసీగా గెలిచి, ఎంపీపీ పదవిని అధిష్టించడానికి అవకాశం కల్పించిన గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధిలో, సమస్యల పరిష్కారంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, టీఆర్ఎస్ మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి తనకు అన్ని వేళలా వెన్నంటి నిలిచారని, వారికి రుణపడి ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. మంత్రి మల్లారెడ్డిపై విశ్వాసం ఉందని, తగిన సమయంలో న్యాయం చేస్తారని పేర్కొన్నారు.


Next Story