జువైనల్ హోమ్ బాలనేరస్తుడు ఎస్కేప్..

by Disha Web Desk 20 |
జువైనల్ హోమ్ బాలనేరస్తుడు ఎస్కేప్..
X

దిశ, దుండిగల్ : కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం బాలనేరస్తుల ప్రత్యేక జువైనల్ హోమ్ నుండి ఓ బాలనేరస్తుడు నిర్వాహకుల కళ్లుగప్పి పరారైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రంగారెడ్డి జిల్లా కొత్తపేట మండలం మార్గదర్శి కాలనీకి చెందిన దాసరి బాలస్వామి కుమారుడు దాసరి ఆంజనేయులు (16) పలు దొంగతనాల కేసులో బాలనేరస్తుడు. ఇతను గతంలో సైదాబాద్ జువైనల్ హోమ్ లో 8 నెలలు శిక్షణనుభవించిన బాలనేరస్తుడు గత సంవత్సరం నవంబర్ 18 న గాజులరామారం జువైనల్ హోమ్ (బాలల ప్రత్యేక పరిశీలన గృహం) కు మార్చారు. గత 5 నెలలకు పైగా గాజులరామారంలో ఉంటున్న ఇతను కార్పెంటర్ పనులు చేస్తున్నట్లు తెలిసింది. అధికారుల కళ్ళుకప్పి ఉన్నట్లుండి పరారుకావడంలో సిబ్బంది పర్యవేక్షణ, నిర్లక్ష్యం కనిపిస్తుంది.

ఓవైపు భద్రతా చర్యలు సరిగాలేకపోవడం, ఇటీవల పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం కూల్చివేసిన ప్రహారినీ తిరిగి నిర్మించకపోవడం బాలనేరస్తుడు పరార్ కావడానికి కారణంగా కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జువైనల్ కేంద్రాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెపుతున్నా అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. గత సంవత్సరం డిసెంబర్ 17 న రాష్ట్ షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అట్టహాసంగా ప్రత్యేక గృహంకోసం శంకుస్థాపన చేసినా పనులు మొదలుకాకపోవడమే ఇందుకు నిదర్శనం. ఓ వైపు భద్రతా లోపం, మరో వైపు పెట్రోల్ బంక్ నిర్మాణం కోసం కూల్చివేసిన గోడను తిరిగినిర్మించకపోవడం బాలనేరస్తుడు పారిపోవడానికి కారణంగా కనబడుతుంది. ఇది సంబంధిత అధికారుల నిర్లక్షమా..? లేక భద్రతాలోపమా తెలియాల్సి ఉంది.

నిఘావైఫల్యం..

గాజులరామారం జువైనల్ హోంలో వివిధ నేరాలలో శిక్షను అనుభవిస్తున్న బాలనేరస్తులు 50 మంది, 5 గురు సిబ్బంది. కట్టుదిట్టమైన భద్రత చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ధంగా వ్యవహరించడంతోపాటు, ఇటీవల జువైనల్ హోమ్ గోడను కూల్చేసిన జువైనల్ హోమ్ ఉన్నతాధికారులు పెట్రోల్ బంక్ ఏర్పాటుకోసం గోడను తొలగించారు. భద్రతాలోపాలు కొట్టొచ్చినట్లు కనిపిడుతుండడంతోనే బాలనేరస్తుడు పారిపోవడానికి అవకాశం దొరికినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సిబ్బంది 5 గురు ఉన్నా నిర్లక్షయంగా ఉండడమే కారణమా అంటే అవును అనక మానదు

దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..

గాజులరామారం ప్రత్యేక జువైనల్ హోమ్ నుండి రంగారెడ్డి జిల్లాకు చెందిన బాలనేరస్తుడు ఆంజనేయులు మే 1వ తేదీన అధికారుల కళ్లుకప్పి పారిపోవడంతో సంబంధిత అధికారి సంగమేశ్వర్ అదేరోజు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీస్ లు క్రైమ్ నంబర్ 364/2023 అండర్ సెక్షన్ బాయ్ మిస్సింగ్ గా కేసునమోదు చేసుకున్న పోలీస్ లు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. 5 రోజులు గడిచినా బాలనేరస్తుని ఆచూకీ లభించలేదు.

Next Story

Most Viewed