ఫాక్స్ సాగర్ మాయం..! బరితెగిస్తున్న కబ్జారాయుళ్లు..

by Disha Web Desk 11 |
ఫాక్స్ సాగర్ మాయం..! బరితెగిస్తున్న కబ్జారాయుళ్లు..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: పేదలకు గజం స్థలం ఇవ్వాలంటే అధికారులు సవాలక్ష కొరివిలు పెడుతుంటారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటారు. అయితే కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములు, చెరువు, కుంటలు, చివరకు చెరువు కట్టలను సైతం కబ్జా చేస్తున్న చూసీ చూడనట్లు వ్యవహారిస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు బడాబాబుల కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. అధికారుల అండ, పాలకుల దండ ఉంటే చాలు అక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువులోని ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ భూములను అక్రమణదారులు కబ్జా చేస్తున్నా.. పట్టించుకునే దిక్కులేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.


రెండో అతిపెద్ద చెరువు ...

జీడి మెట్ల ఫాక్స్ సాగర్ చెరువు హైధరాబాద్ లోనే రెండవ అతిపెద్ద చెరువుగా గుర్తింపు పొందింది. చెరువు నీటి సామర్థ్యం 30 నుంచి 35 అడుగులు ఉంటుంది. వర్షాలు కురిసిన ప్రతిసారి చెరువు కింద ఉన్న కాలనీవాసులు కంగారు పడుతుంటారు. గతేడాది కురిసిన వర్షాలకు ఉమామహేశ్వర్ కాలనీ మూడు నెలలపాటు నీటిలోని మునిగింది. చెరువు కింద కాలనీలైనా షాపుర్ నగర్, జీడిమెట్ల, సుభాష్ నగర్ ల ప్రాంతాల్తలోని ప్రజలు క్షణం ఒక యుగంలా గడుపుతుంటారు. వర్షాలు కురిసిన ప్రతిసారి అధికార, పాలన యంత్రాంగం హడావిడి చేస్తోంది. ఆ తర్వాత షరామాములే.. చెరువు చుట్టూ పక్కన ప్రాంతాలను కబ్జా చేస్తున్నా.. కట్టడి చేసే యంత్రాంగం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చెరువు పరిసర ప్రాంతాలు యధేచ్చగా అక్రమణకు గురవుతున్నా.. కబ్జా రాయుళ్ల నుంచి కాపాడడం లేదన్న ఆగ్రహం వ్యక్తం వ్యక్తమవుతోంది.

యధేచ్చగా కబ్జాలు..

ఫాక్స్ సాగర్ బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ స్థలాల్లో బడాబాబులు యధేచ్చగా అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. చెరువు చుట్ట పక్కల సర్వే నెంబర్ 34లో చెరువు కట్ట ఉండగా, సర్వే నెంబర్ 35లో ప్రభుత్వ భూములున్నాయి. అదేవిధంగా సర్వే నెంబర్లు 36, 37, 44 లలో ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ స్థలాలుండగా, సర్వే నెంబర్లు 38, 39లలో ఎఫ్ టీఎల్ స్థలాలు ఉన్నాయి. అయితే ఈ స్థలాల్లో అక్రమంగా భారీ షెడ్లు నిర్మితమవుతున్నాయి. కొందరు స్థలాలను కబ్జా చేసి ప్రీ కాస్ట్ వాల్స్ ను నిర్మిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా.. అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో చెరువు స్థలాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు సుభాష్ నగర్, జీడిమెట్ల కు చెందిన రమణరెడ్డి, సందీప్ తెలియజేస్తున్నారు. అక్రమార్కులతో అధికార యంత్రాంగం కుమ్మక్కై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం కబ్జాదారుల నుంచి బఫర్ జోన్, ఎప్ టీఎల్ స్థలాలను రక్షిస్తుందా... ? అక్రమార్కులకే వత్తాసు పలుకుతుందా...? ఏ చర్యలు తీసుకుంటుందో.. వేచి చూడాలి..



Next Story

Most Viewed