నా పేరు తీస్తే అంగీ, లాగు ఊడదీసి కొడతా : రఘునందన్ రావు

by Disha Web Desk 22 |
నా పేరు తీస్తే అంగీ, లాగు ఊడదీసి కొడతా : రఘునందన్ రావు
X

దిశ, సంగారెడ్డి బ్యూరో/కంది : ఇంకోసారి ఎవరైనా తన పేరు తీసి తప్పుగా మాట్లాడితే అంగీ, లాగు ఊడదీసి మరి కొడతా అని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంత మంది గన్మెన్లను పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇంటికి వచ్చి మరి కొడతా. ఇవేవో సినిమా డైలాగులు కాదని మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలపై రఘు నందన్ రావు మండిపడ్డారు. పట్టణంలో బుధవారం పార్టీ కార్యాలయంలో బూత్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఇంటికి వచ్చి మరీ కొడతా…

తనపై ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే ఇంటికొచ్చి మరీ కొడతానంటూ రఘునందన్ రావు మాజీ మంత్రి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డిలను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కబ్జాలు చేసి, కాళ్లు మొక్కే వారికి ఎంపీ టికెట్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో జనం కోసం పని చేసే నాయకులకే గుర్తించి టికెట్లు ఇస్తారని అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ అభివృద్ధి కోసం ఏనాడు కూడా పార్లమెంట్‌లో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. తను పైసలు వసూలు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నానని తప్పుడు ఆరోపణలు చేసిన వారు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తాను డబ్బులు వసూలు చేసి ఉంటే వారి ప్రభుత్వంలో ఎందుకు తనపై కేసులు పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు. దుబ్బాకలో ఎమ్మెల్యేగా ఓడిపోయానంటే దానికి మీ నీచ రాజకీయాలే కారణం అన్నారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన మీ మామ కేసీఆర్ కామారెడ్డిలో ఎలా ఓడిపోయాడు..? ఒకసారి ప్రశ్నించుకో అంటూ హరీష్ ను ఉద్దేశించి అన్నారు.

సిద్దిపేటలో మీ మెజార్టీ ఎందుకు తగ్గిందో హరీష్ చెప్పాలన్నారు. ఆర్. సత్యనారాయణను నట్టేట ముంచారని, తెలంగాణ ఉద్యమంలో ఒక విలేఖరిగా పని చేస్తూ స్వతహాగా ఎమ్మెల్సీగా గెలిచిన ఆర్. సత్యనారాయణను బీఆర్ఎస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని రఘునందన్ రావు అన్నారు. ఆరేళ్ల పాటు ఉన్న ఎమ్మెల్సీ పదవిని మాయ మాటలు చెప్పి ఏడాదికి గుంజుకున్న నీచులని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి కాకుండా కబ్జాలు, సెటిల్మెంట్లు చేసిన వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కరీంనగర్‌కు చెందిన హరీష్ రావుకు మెదక్‌లో ఏం పని అంటూ ప్రశ్నించారు. అది చాలదు అంటూ తాజాగా మహబూబ్ నగర్‌కు చెందిన వెంకటరామిరెడ్డిని తెచ్చి ఇక్కడ ఎంపీ టికెట్ ఇవ్వడం సరికాదన్నారు.

వెంకట్రామిరెడ్డికి అన్ని కోట్ల డబ్బులు ఎక్కడివి..?

అడిషనల్ కలెక్టర్‌గా, తర్వాత కలెక్టర్‌గా పని చేసిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. గతంలో రింగ్ రోడ్డు దగ్గర రు. 1000 కోట్లలతో 10 ఎకరాలను వెంకట్రామిరెడ్డి ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. ఆ డబ్బంతా మాజీ మంత్రి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్‌లకు చెందినది కాబట్టే వారికి తొత్తుగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు.

గెలుపు బీజేపీదే….

బీజేపీ తరఫున ఎంపీ బరిలో ఉన్న తన గెలుపుకు కార్యకర్తలు అందరూ గట్టిగా కృషి చేయాలని రఘునందన్ రావు కోరారు. ఇప్పటి నుంచే ఆ దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలని వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పులిమామిడి రాజు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ద్వారకా రవి, ఎస్సీ సెల్ మోర్చా అధ్యక్షులు కొండాపురం జగన్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed