ALERT : ‘ఈఏపీసెట్’ పరీక్ష రాసే విద్యార్థులకు బిగ్ అలర్ట్

by Disha Web Desk 4 |
ALERT : ‘ఈఏపీసెట్’ పరీక్ష రాసే విద్యార్థులకు బిగ్ అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంజినీరింగ్, ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించే ‘ఈఏపీసెట్’ ప్రవేశ పరీక్ష నిర్వహణపై ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. కాగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఈఏపీసెట్)కు సోమవారం వరకు అన్ని విభాగాలకు కలిపి మొత్తం 3,54,803 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు స్పష్టంచేశారు. రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని వెల్లడించారు. కాగా ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 2,54,543 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో తెలంగాణ విద్యార్థులు 2,05,472 మంది ఉండగా ఏపీ విద్యార్థులు 49,071 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇకపోతే అగ్రికల్చర్ విభాగానికి 1,00,260 దరఖాస్తులు వచ్చాయి.

ఇందులో తెలంగాణ విద్యార్థులు 87,911 మంది ఉండగా.. ఏపీ విద్యార్థులు 12,349 మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈఏపీసెట్ పరీక్షలు కొనసాగనున్నాయి. రెండు సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు సెకండ్ సెషన్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి పరీక్షలు జరుగుతాయని అధికారులు స్పష్టంచేశారు. 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలో కలిపి మొత్తం 21 టెస్ట్ జోన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టంచేశారు. తెలంగాణలో 16 జోన్లు, ఏపీలో 5 జోన్లు ఉన్నట్లు తెలిపారు. కాగా అగ్రికల్చర్ విభాగానికి 135 పరీక్ష కేంద్రాలు, ఇంజినీరింగ్ విభాగానికి 166 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మే నెలాఖరులోగా ఫలితాలు విడుదల చేయనున్నటులు అధికారులు స్పష్టంచేశారు.

జేఎన్టీయూలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. ఈఏపీసెట్ కు రోజురోజుకూ ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. గతంలో 3.26 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటే ఈ ఏడాది 3.54 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇవి చాలా సున్నితమైన పరీక్షలని, ఇంటర్ తర్వాత విద్యార్థులు రాసే ఎంట్రెన్స్ గా ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలను ముందుగానే తెలుసుకోవడం మంచిదని ఆయన సూచించారు. 90 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు. టీసీఎస్ సంస్థ సహకారంతో పరీక్షలు నిర్వహిస్తున్నామని లింబాద్రి వెల్లడించారు. విద్యార్థులు ఈ పరీక్ష తేదీల్లో ఏదైనా సెంట్రల్ లెవల్ పరీక్ష రాస్తున్నట్లయితే తమకు ముందుగానే మెయిల్ చేయాలని, దానికి అనుగుణంగా మరో తేదీలో వారికి పరీక్ష నిర్వహిస్తామని స్పష్టంచేశారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లింబాద్రి భరోసా ఇచ్చారు.

వెబ్‌సైట్‌లో అగ్రికల్చర్ విభాగం హాల్ టికెట్లు

ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన హాల్ టికెట్లను అధికారులు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు సంబంధించిన హాల్ టికెట్లను మే 1 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని స్పష్టంచేశారు. కాగా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి చెందిన విద్యార్థులు eapcet.tsche.ac.in వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు త‌మ రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్, పుట్టిన తేదీ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి త‌మ హాల్ టికెట్లు పొందొచ్చని వెల్లడించారు.

Next Story