AP Politics:ఏ రోజైనా మీ పార్టీ నాయకులను గౌరవించావా?: పరిటాల సునీత

by Disha Web Desk 18 |
AP Politics:ఏ రోజైనా మీ పార్టీ నాయకులను గౌరవించావా?: పరిటాల సునీత
X

దిశ ప్రతినిధి,అనంతపురం: ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఏ రోజైనా వైసీపీ నాయకుల్ని గౌరవించి ఉంటే.. వారు ఈరోజు పార్టీలో ఉండేవారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ప్రజలతో పాటు సొంత పార్టీ నాయకులను కూడా వేధించారు కాబట్టే.. వారంతా తమ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. తాజాగా రాప్తాడు నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 80 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వెంకటాపురం క్యాంపు కార్యాలయంలో పరిటాల సునీత సమక్షంలో నసనకోట, కొత్తగాదిగకుంట, మాదాపురం, రామగిరి, తిమ్మాపురం గ్రామాలకు చెందిన 25 కుటుంబాలు పార్టీలో చేరాయి.

అనంతపురం క్యాంపు కార్యాలయంలో అక్కంపల్లి, భోగినేపల్లి, రాప్తాడు గ్రామాలకు చెందిన 40 కుటుంబాల వారు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పరిటాల సిద్ధార్థ ఆధ్వర్యంలో అనంతపురం క్యాంపు కార్యాలయంలో కందుకూరు, పూలకుంట గ్రామాలకు చెందిన 15 కుటుంబాలు పార్టీలో చేరారు. వీరందరికీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో తమకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని..పరిటాల సునీత ద్వారానే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్న ఉద్దేశ్యంతోనే పార్టీలో చేరినట్టు వారు వివరించారు. మరోవైపు పరిటాల సునీత మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గెలుపు కోసం పని చేసిన వారు కూడా నేడు ఆయన ఓడిపోవాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న నాయకుడు ఎవరూ ఉండరని ఆమె కామెంట్ చేశారు.

Next Story