కరీంనగర్‌లో ఘోరం.. ఐదు ఇళ్లలో పేలిన గ్యాస్ సిలిండర్లు

by Disha Web Desk 2 |
కరీంనగర్‌లో ఘోరం.. ఐదు ఇళ్లలో పేలిన గ్యాస్ సిలిండర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఆదర్శనగర్‌లోని పూరి గుడిసెల్లో భారీ శబ్ధాలతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి దాదాపు ఐదు ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ పేలుడు కారణంగా చుట్టు పక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రానట్లు తెలుస్తోంది. కాగా, ఆ గుడిసెల్లో నివసించే కార్మికులంతా మేడారం జాతరకు కుటుంబసమేతంగా తరలి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి గత 20 ఏళ్లుగా కార్మికులు ఆ పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రమాద విషయం కార్మికులకు తెలియజేయగా.. తాము ఇళ్లలో సమ్మక్క-సారలమ్మకు దీపాలు పెట్టుకొని వెళ్లామని.. అవి గుడిసెలకు అంటుకొని మంటు వ్యాపించి ఉంటాయని చెబుతున్నారు..







Next Story

Most Viewed