దొరకని ప్రేమికుల జాడ.. ఫలించని గాలింపు చర్యలు

by Web Desk |
దొరకని ప్రేమికుల జాడ.. ఫలించని గాలింపు చర్యలు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లా రేవల్లి మండలం గంగదేవిపల్లి గ్రామంలోని కేఎల్ఐ ఎత్తిపోతల వద్ద గురువారం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసిపెట్టిన ప్రేమికుల జాడ లభించలేదు. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్‌కు చెందిన నరేష్, తనకు మరదలు అయిన కల్వకుర్తికి చెందిన మైనర్ బాలిక గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో గురువారం మధ్యాహ్నం గంగాదేవిపల్లి కేఎల్ఐ ఎత్తిపోతల వద్ద నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లగా అక్కడ నరేష్, మైనర్ బాలికల సెల్ ఫోన్లు, చెప్పులు, బ్యాగులు, పెద్దలు ఒప్పుకోకపోవడం మూలంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ పెట్టి మాయమయ్యారు. వాళ్లు పెట్టిన వస్తువులు, పరిసర ప్రాంతాలు గమనించిన పోలీసులు ఆత్మహత్య చేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండ్రోజులుగా గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రేవల్లి ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ గాలింపు చర్యలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం వరకు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో మోటార్లు పెట్టి, నీటిని బయటకు తోడే ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా, జంట ఆత్మహత్యకు పాల్పడ్డారా..? ఎక్కడికైనా వెళ్లిపోయారా? అనే సందేహాలూ ఉన్నాయి. ఈ కేసులో శనివారం నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.

Next Story

Most Viewed