విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి : కలెక్టర్ ప్రతీక్ జైన్

by Ratna Kumari |

మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహాన్ని మంగళవారం కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు.

విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి : కలెక్టర్ ప్రతీక్ జైన్
X

దిశ, ఊట్కూర్ : మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహాన్ని మంగళవారం కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని బాత్రూమ్‌లు, నివాస గదులు, వంటశాల సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులు బాత్రూమ్‌లను ప్రతి రోజు సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై వారి దిన చర్య గురించి తెలుసుకుని చదువుపై దృష్టి సారించాలని సమయపాలన పాటించాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వంటల నాణ్యత ఆహారపు మెను గురించి వివరాలు తెలుసుకున్నారు.

ఆహారం పోషకాహారంతో కూడి ఉండేలా చూడాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వసతి గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. పరిశుభ్రత, క్రమశిక్షణ, సమయపాలన ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలంటే విద్యతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని తెలిపారు. క్రమశిక్షణతో జీవనం గడిపితే జీవితంలో విజయాలు సాధించవచ్చని చెప్పారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ.డి.ఎస్.సి. కార్పొరేషన్ అబ్దుల్ ఖలీల్, తహసీల్దార్ రవి, సీఐ రామ్ లాల్, ఏఎస్ డబ్ల్యూ పరమేశ్, వెంకటేశ్ వార్డెన్, సర్పంచ్ రేణుక ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు..

Next Story