పాలమూరు నాడు కరువుకు నెలవు... నేడు సాగుకు కల్పతరువు...

by Disha Web Desk 20 |
పాలమూరు నాడు కరువుకు నెలవు... నేడు సాగుకు కల్పతరువు...
X

దిశ ప్రతినిధి, వనపర్తి : తెలంగాణ రాష్ట్రం రాకముందు పాలమూరు జిల్లా కరువుకు నెలవుగా ఉండేదని, సొంత రాష్ట్రం సాధించుకున్నాక అదే పాలమూరు జిల్లా నేడు పంటల సాగుకు కల్పతరువుగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద రూ. 300 కోట్లతో నిర్మించనున్న ఆయిల్ ఫామ్ నూనె కర్మాగారం కోసం మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ వ్యవసాయం వల్ల రైతులకు లాభాలు రావడం లేదని, పంటల మార్పిడి వల్ల వ్యవసాయాన్ని బలోపేతం చేయవచ్చని సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఆలోచించారని ఆయన గుర్తుచేశారు. దేశంలో అవసరమైన 70 శాతం వంటనూనెలు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని, వరి ఉత్పత్తిలో దేశానికి దారి చూపినట్లే వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు కేసీఆర్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మొదట ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీ కారం చుట్టి రైతులను చైతన్యం పరిచారని అన్నారు. 14 కంపెనీలతో ఆయిల్ ఫామ్ సాగుకు అందుబాటులో ఫ్యాక్టరీలు నిర్మించి రైతులను ప్రోత్సహిస్తామని, నాలుగేళ్లలో ఆయిల్ ఫామ్ పంట చేతికి వచ్చే వరకు అంతరపంటలు సాగు చేసుకోవచ్చని, ఏడాదికి లక్ష పై చిలుకు ఆదాయం ఆయిల్ పామ్ సాగుతో సాధ్యం అవుతుందని కేటీఆర్ సూచించారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగు గణనీయంగా పెరగడం వల్లనే నేడు వనపర్తి జిల్లాలో రూ.300 కోట్లతో ఆయిల్ ఫామ్ నూనె కర్మాగారం నెలకొల్పుతున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సారధ్యంలో తెలంగాణలో వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందని కేటీఆర్ ప్రశంసించారు.

ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహానికి జిల్లాల వారీగా జోన్లను విభజించి కంపెనీలకు అప్పజెప్పామని, 35 ఏళ్లలో 39 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగవుతుండగా గత రెండేళ్లలోపే లక్ష 22 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టామని, త్వరలోనే రెండు లక్షల ఎకరాలకు చేరుకుంటామని, నిరంజన్ రెడ్డి అన్నారు. అనంతరం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం బలోపేతం చేసే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారని అందులో భాగంగానే ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కార్పోరేషన్ చైర్మన్లు రజనీ సాయిచంద్, వాల్యా నాయక్, ఆంజనేయ గౌడ్, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed