అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..

by Disha Web Desk 11 |
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..
X

దిశ, వీపనగండ్ల: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లతో పాటు ఇసుక తోడుతున్న రెండు జేసీబీలను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేసి పోలీస్ స్టేషన్ తరలించిన ఘటన వీపనగండ్ల మండలంలో జరిగింది. మండల పరిధిలోని తూముకుంట ఓంకారేశ్వర వాగు నుంచి (ప్రభుత్వ ఇసుక రీచ్) బుధవారం రాత్రి రెండు జేసీబీలతో అక్రమంగా ఇసుకను తవ్వుతూ ఐదు ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వనపర్తి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాగు వద్దకు చేరుకుని వాగులో ఇసుకను తోడుతున్న రెండు జేసీబీలను, ఇసుకను తరలిస్తున్న మరో ఐదు ట్రాక్టర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రాత్రి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుక తవ్వకాల గురించి మీడియాలో వార్తలు వస్తున్నా, స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిఘా ఉంచి రాత్రివేళ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న జేసీబీలను, ట్రాక్టర్లను పట్టుకోవడంతో స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారుల వైఫల్యంపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ఎస్ఐ రామన్ గౌడ్ ను వివరణ కోరగా స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ సమాచారంతో వాగులోకి వెళ్లి ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రామన్ గౌడ్ తెలిపారు



Next Story