వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను వెంట‌నే ఇవ్వాలి

by velandi.Saikiran |

వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్ల కోసం కార్యాల‌యాల చుట్టూ రైతులు తిర‌గ‌క్క‌ర్లేద‌ని జూప‌ల్లి

వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను వెంట‌నే ఇవ్వాలి
X

దిశ, కొల్లాపూర్: వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్ల కోసం కార్యాల‌యాల చుట్టూ రైతులు తిర‌గ‌క్క‌ర్లేద‌ని, డీడీలు క‌డితే స‌రిపోతుంద‌ని, స్తంభాలు, వైర్లు మోయాల్సిన అవసరం లేదని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. డీడీ క‌ట్టిన 60 రోజుల్లో వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్ ఇవ్వాల్సిన బాధ్య‌త విద్యుత్ శాఖ అధికారుల‌పై ఉంద‌ని చెప్పారు. శుక్ర‌వారం పెంట్లవెల్లి మండలం కొండూరులో రూ,2.70 కోట్లతో నిర్మించనున్న 33/11 కే వీ విద్యుత్ సబ్ స్టేషన్,ఇందిరమ్మ ఇళ్లు,ఆరోగ్య ఉప కేంద్రం, కొల్లాపూర్ మండలం మొల చింత పల్లి లో 33/11 కే వీ విద్యుత్ సబ్స్టేషన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే కలకూరు నుంచి మైలారం వరకు పిడబ్ల్యూడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... వ్యవసాయ బోరు బావికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి ట్రాన్స్ఫార్మర్, సరిపడ విద్యుత్ స్తంభాలు, కాసారాలు, ఇతర సామాగ్రిని కాంట్రాక్ట‌ర్ల‌కు ఇచ్చి పని చేసినందుకు డబ్బులు కూడా మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే రైతు స్తంభాలు, వైర్లు, ఇతర పనిముట్లు కొని స్తంబాలు సైతం మోస్తున్నార‌ని అన్నారు. ఇక నుండి ఇలా జరగడానికి వీల్లేద‌ని, డి.డి కట్టి దరఖాస్తు చేసుకుంటే నిర్ణిత గడువు 60 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ బిగించి కనెక్షన్ ఇచ్చే బాధ్యత విద్యుత్ శాఖదేనని మంత్రి తేల్చిచెప్పారు. ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్ధిదారుల ఎంపిక పార‌ద‌ర్శ‌కంగా చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 8 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారని మంత్రి జూపల్లి ఆరోపించారు. వారు చేసిన అప్పులకు నెలకు వడ్డీ రూ, 6500 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డి.సి.సి.బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్. ఈ. రాజశేఖరం, తహసిల్దార్ లు, కాంగ్రెస్ నాయకులు గోపాల్ నాయుడు హనుమంతు నాయక్ మేకల నాగరాజు వంగ రాజశేఖర్ గౌడ్ కొమ్మ వెంకటస్వామి యాదవ్, మాజీ సర్పంచ్ కుమ్మరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story