మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు : ఎంపీ కోమటిరెడ్డి

by Disha Web Desk 11 |
మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు : ఎంపీ కోమటిరెడ్డి
X

దిశ, జడ్చర్ల : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దొరల పాలైందని, కేవలం ఎనిమిది కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి తప్ప పేదలకు సంక్షేమం అభివృద్ధి చేరలేదని టీపీసీసీ స్టార్ క్యాంపెనర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిరుద్ రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, కమిషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టును నాణ్యత లేకుండా కట్టడంతో నేడు మేడిగడ్డ బ్యారేజ్ కిందకి వంగిందని చెప్పారు.

కేసీఆర్ మోసపూరిత హామీలు తప్ప డబల్ బెడ్ రూమ్ లో ఎక్కడ కట్టలేదని, కొన్నిచోట్ల కట్టిన ఇండ్లు పేదల కేటాయించలేదని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారని దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి అంటూ కొత్త కొత్త పథకాలు తీసుకొట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. 60 ఎకరాలు ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ నేడు 600 ఎకరాలు అయిందని, ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ బాగుపడలేదు అన్నారు. తెలంగాణ ఏర్పడినపుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నేడు సుమారు 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు.

ఇప్పుడు కేసీఆర్ కు భయం పుట్టి రోజుకు మూడు సభలు నిర్వహిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది లేదని చెప్పారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చినట్లే రూపాయలు 17 లక్షల నష్టపరిహారం జడ్చర్ల లోని ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా అందజేయాలని డిమాండ్ చేశారు. ఉదండాపూర్ బిడ్డలు కూడా తెలంగాణలో ఉన్నారు కదా వారి పై ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు.ఆంధ్రాలో నష్టపోతామని తెలిసినా కూడా తెలంగాణలో విద్యార్థుల, అమాయకుల ఆత్మ బలిదానాలు చూసి చలించి తెలంగాణను సోనియా గాంధీ ప్రకటించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చెప్పింది చెప్పినట్లే చేసిందని, దేశానికి తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చిన పార్టీ అని తెలిపారు.

గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లక్ష రూపాయలు ఇచ్చామని ఒక్కో గ్రామానికి సుమారు 500 లైన్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఒక్క నోటిఫికేషన్ కూడా సక్రమంగా నిర్వహించడానికి చేతకాని ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం పాలిస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడని సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేటీఆర్ అమెరికాలో ఏం పని చేసేవాడో గుర్తు చేసుకోవాలన్నారు. దేశం కోసం, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని హితువు పలికారు.

తమ్ముడిని చంపిన హంతకుడిని 25 కోట్లకు బీఆర్ఎస్ పార్టీ లో చేర్చుకున్నా బీఆర్ఎస్ నాయకులకు సిగ్గులేదని అలాంటి నాయకులతో నష్టమే తప్ప లాభం ఉండదని ఇటీవలే బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ను ఉద్దేశించి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి అనిరుధ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అని, 100 సీట్లను పార్టీ తప్పక తెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డి టీపీసీసీ కార్యదర్శి రబ్బాని, నాయకులు నిత్యానందం, అల్వాల్ రెడ్డి, ఎంపిటిసి గౌస్ మినాజ్, బుక్క వెంకటేశం సాయిలు, రామ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed