బిగ్ బ్రేకింగ్: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఘర్ వాపసీ సక్సెస్ అయింది. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మంతనాలు జరిపిన రాజగోపాల్ రెడ్డి.. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన.. తెలంగాణలో అవినీతి అరాచక, నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడే శక్తి బీజేపీకి ఉందని భావించి 15 నెలల క్రితం తాను ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాను.

కానీ కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడంలో, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడంలో బీజేపీ విఫలం అయిందని తాను చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారాయి. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నయాంగా కాంగ్రెస్ అని ప్రజలు భావిస్తున్నారు. అందుకే తాను కూడా రాష్ట్ర ప్రజల ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. కాగా రాజగోపాల్ రెడ్డి వచ్చే శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్‌గా మారబోతున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కేసీఆర్, బీజేపీలకు ఊహించని దెబ్బ:

రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం బీజేపీతో పాటు బీఆర్ఎస్‌కి షాక్ తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు కొనసాగుతున్న క్రమంలో పార్టీని వీడిన రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరడం హస్తం పార్టీకి అదనపు బలంగా మారే అవకాశం ఉంది. ఈ దెబ్బతో కాంగ్రెస్ లో చేరేందుకు తటపటాయిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు ముందడుగు వేసే అవకాశం ఉంది.

ఇదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటే అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే రాష్ట్ర ప్రజలకు చెబుతూన్నారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి సైతం కేసీఆర్ సర్కారు అవినీతిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించడం బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటే అనే ప్రచారం ప్రజల్లోకి మునుపటికంటే మరింత బలంగా వెళ్లే అవకాశం ఉంది.

ఇదే జరిగితే హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్‌కు, సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి భారీ ఎదురుదెబ్బగా మారనుంది. ప్రస్తుతం బీజేపీలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు మాజీలు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎఫెక్ట్‌తో వారంతా కాంగ్రెస్ వైపు వస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. అదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు మరింత ధీమా దక్కుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మునుగోడా.. ఎల్బీ నగరా..?

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే కావడంతో ఆయన పోటీ చేసే స్థానంపై చర్చ మొదలైంది. ఈసారి మునుగోడుకు బదులు ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.

దీంతో రాజగోపాల్ రెడ్డి కోసమే ఈ రెండు చోట్ల అభ్యర్థులను పెండింగ్ పెట్టిందనే చర్చ జరుగుతోంది. అయితే కోమటిరెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఫిక్స్ కావడంతో ఆయన మునపటిలా మునుగోడు నుంచే పోటీ చేస్తారా లేక ఎల్బీనగర్‌ను ఎంచుకుని కొత్త ప్రయోగానికి సిద్ధం అవుతారా అనేది తేలాల్సి ఉంది.



Next Story

Most Viewed