రౌడీ రాజ్యమా... ప్రజారాజ్యమా.. భద్రాది కొత్తగూడెం జిల్లా జడ్పీచైర్మన్

by Disha Web Desk 20 |
రౌడీ రాజ్యమా... ప్రజారాజ్యమా.. భద్రాది కొత్తగూడెం జిల్లా జడ్పీచైర్మన్
X

దిశ, ఇల్లందు : బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎవరైతే ఎదురు తిరుగుతారో వారిని తరిమికొట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనడం విడ్డూరంగా ఉందని భద్రాది కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మంగళవారం ఇల్లందు జెడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతారో వారిని తరిమికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉసిగొల్పడం ఒక మంత్రిగా ఆయనకే చెల్లిందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ లేకుండా చేయాలన్నదే బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశమని అందుకే మంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రౌడీ రాజ్యాన్ని ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పొంగులేటి వర్గీయుల పై దాడిచేయడం ఆయన అధికార దర్పానికి నాంది అన్నారు. 1998లో మమతా కాలేజీని స్థాపించి విద్యార్థులు తల్లిదండ్రులను లక్షల్లో సంపాదించింది పువ్వాడ కుటుంబమన్నారు.

రాజకీయ లబ్ధికోసమే సీపీఐ పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ నుండి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరింది పువ్వాడ అన్నారు. ఒక మంత్రిగా ప్రజలతో మమేకమై ప్రజల సంక్షేమ కోసం పనిచేయాల్సిన పువ్వాడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు రౌడీ రాజకీయం చేయమని అనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు దాడులు చేయడం, గొడవలు చేయడం, రౌడీలను ప్రోత్సహించడం పువ్వాడకు తెలిసిన రాజకీయమన్నారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక చిన్న కాంట్రాక్టర్గా మొదలై క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా ఎదిగిన తీరు అందరికి తెలుసు అన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో ప్రజలకు దానధర్మాలు చేస్తున్నారన్నారు.

పువ్వాడలాగా విద్యార్థులు నుండి ఫీజుల రూపేనా అక్రమంగా సంపాదించిన డబ్బుతో, కబ్జా భూములతో కొన్ని వేల కోట్లు వెనకేసుకున్నారు. ఇల్లందు ప్రాంతంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఒక్కతే ఇల్లందుని అభివృద్ధి చేసినట్లు మాట్లాడడం విడ్డూరమన్నారు. ఎమ్మెల్యే భర్త షాడో ఎమ్మెల్యేగా ఇల్లందులో ఇసుకదందా, కోల్ ట్రాన్స్ పోర్ట్ దందా, ప్రభుత్వభూముల కబ్జాలను చేస్తూ నాలుగు కోట్ల రూపాయల ఇంటిని, ప్రజావైద్యశాలని కోటి రూపాయల హాస్పిటల్, హరి ప్రియ ఫౌండేషన్ తో 70 లక్షల ఇంటిని ఆక్రమించి భవనాలు, కొన్ని వందల కోట్లు సంపాదించారన్నారు . పువ్వాడ అజయ్ కుమార్ కి దమ్ముంటే తనపై అవిశ్వాసం పెట్టి నెగ్గాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల రాము, బోళ్ల సూర్యం, పునేం సురేందర్, ధనుంజయ్ , నందకిషోర్, సూర్ణపాక సత్యనారాయణ, శీను, తాటి బిక్షం, రావూరి సతీష్, భరత్, హరినాథ్ బాబు, బోల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed