పాలమూరు... ప్రజల కరువు తీర్చే అతిపెద్ద ప్రాజెక్టు

by Sridhar Babu |
పాలమూరు... ప్రజల కరువు తీర్చే అతిపెద్ద ప్రాజెక్టు
X

దిశ, ఖమ్మం : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాలమూరు ప్రజల కరువు తీర్చే అతిపెద్ద ప్రాజెక్టు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ దండగ కాదు, పండుగ అని అన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్ట్ ప్రారంభం చేస్తాం అంటే ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయని మండిపడ్డారు. ప్రాజెక్టు ప్రారంభాన్ని ప్రజలు పండుగలా భావిస్తే, వారు దండుగ అంటున్నారని తెలిపారు.

ఓ వైపు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే మరో వైపు అడ్డంకులు సృష్టించారని, ఇప్పుడు ప్రాజెక్టు ప్రారంభం చేస్తామంటే.. మళ్లీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజలపై పగ సాధిస్తున్నారని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కావాలి.. కాంగ్రెస్ వద్దు అని ప్రజలు నినదిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఢిల్లీ వయా బెంగుళూరు అయితే మాకు మాత్రం తెలంగాణ ప్రజలే అన్నారు. రాబోయే ఎన్నికల్లో నోబెల్స్, గోబెల్స్‌కి మధ్య పోటీ జరగబోతుందన్నారు. గోబెల్స్ ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీని ప్రజలు కోరుకోరని, బీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలుస్తుందన్నారు.

డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్..

లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని హరీశ్‌రావు తెలిపారు. ఆటో డ్రైవర్ కొడుకు, హమాలీ కుమారుడు ఎంబీబీఎస్ చదవటం సంతోషంగా ఉందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందన్నారు. ఐటీ ఉత్పత్తిలో, ఫార్మా రంగంలో, విద్య, వైద్యం, పంట, పాడి ఏ రంగం చూసినా

తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి స్పష్టం చేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదని, ఎందుకు నీళ్లు, కరెంట్ ఇవ్వలేదన్నారు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఆకలి అయితే నాడు అన్నం పెట్టలేదు కానీ నేడు గోరుముద్దలు తినిపిస్తం అంటున్నారని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, రాజస్థాన్‌లో చేయరు కానీ ఇక్కడ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎరువుల కోసం ప్రజలు తన్నులు తినేవారని, తన్నుల పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అయితే బీఆర్ఎస్ పార్టీది పంట ఉత్పత్తి సంస్కృతి అని పేర్కొన్నారు.

ఖమ్మం సస్యశ్యామలం కావాలంటే కేసీఆర్‌ను దీవించండి..

ఏం జరగక ముందే సీట్లు, పదవుల కోసం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతున్నదని హరీశ్‌రావు తెలిపారు. మత కలహాలు సృష్టించి ఎంతకైనా దిగజార్చే పరిస్థితి కాంగ్రెస్‌ది అని పేర్కొన్నారు. సీతారామ పథకం పనులు చివరి దశలో ఉన్నాయని, ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే కేసీఆర్‌ను దీవించండి అని పేర్కొన్నారు. సీతారామ పూర్తయితే కరువు అనే పదం డిక్షనరీలో ఉండదన్నారు. వచ్చే వానాకాలం నాటికి కృష్ణాలో నీళ్లు ఉన్నాలేకున్నా గోదావరి జలాలు వస్తాయని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తింపు

ఆర్టీసీ కార్మికులను గత ప్రభుత్వాలు వారి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని హరీష్ రావు అన్నారు. ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వాలు కూడా చేతులెత్తేస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసినట్టు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి, వద్ధిరాజు రవిచంద్ర, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాత మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed