సంపద కలిగిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది కేసీఆర్

by Disha Web Desk 15 |
సంపద కలిగిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది కేసీఆర్
X

దిశ, ముదిగొండ : సంపద కలిగిన రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చి అభివృద్ధి శూన్యం చేశారని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మధిర ఎమ్మెల్యే బట్టి విక్రమార్క ఓటర్లకు పిలుపునిచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత మండలంలోని గంధసిరి, బాణాపురం, పెద్దమండవ, వల్లభి, మల్లారం గ్రామాలలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చి రాష్ట్ర సంపాదన ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు పెరిగాయని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేసి తీరుతామన్నారు. నీళ్ల కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఒక్క చుక్క నీరు కూడా మన ప్రాంతానికి రాలేదు అని, లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం, మేడిగడ్డ, ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పరీక్ష పేపర్లు లీక్ చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. ప్రచారంలో మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వల దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరావు, మండల నాయకులు మందరపు నాగేశ్వరావు, మట్టా రవీందర్ రెడ్డి, మల్లెల అజయ్, ఐఎన్టీయూసీ మండల అధ్యక్షులు ఉసికల రమేష్, పందిరి అంజయ్య పాల్గొన్నారు.

Next Story

Most Viewed