కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై వీడని సస్పెన్స్.. కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై వీడని సస్పెన్స్.. కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిల వైఎస్సార్టీపీ పార్టీ విలీనంపై సస్పెన్స్ వీడట్లేదు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా షర్మిల సైతం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దీంతో షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్టీపీ కాంగ్రెస్‌లో విలీనం ఇక లాంఛనమే అని వార్తలు వినిపించాయి. సెప్టెంబర్ 2వ తేదీన తన తండ్రి వైఎస్ఆర్ వర్ధంతి రోజున షర్మిల పార్టీ విలీన ప్రకటన చేస్తారని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

కానీ షర్మిల మాత్రం అటువంటి ప్రకటన చేయకపోవడంతో కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం ఎప్పుడు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహల్ గాంధీలతో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారని తెలిపారు. వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై ఆమె వారితో చర్చించారని అన్నారు.

వారి మధ్య స్నేహపూర్వక భేటీ జరిగిందని.. కానీ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై వేచి చూడాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నాడో లేదో తనకు తెలియదన్నారు. కాగా, వైఎస్సార్టీపీ గురించి మాట్లాడిన కేసీ వేణుగోపాల్ వేచి చూడాలంటూ విలీనంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

Next Story

Most Viewed