త్వరలోనే రైతులకు గుడ్ న్యూస్.. ఆ స్కీమ్ నిధుల విడుదలకు సీఎం KCR ప్లాన్..?

by Satheesh |
త్వరలోనే రైతులకు గుడ్ న్యూస్.. ఆ స్కీమ్ నిధుల విడుదలకు   సీఎం KCR ప్లాన్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు బంధు నిధులు ఎప్పుడు విడుదల చేస్తే లాభదాయకంగా ఉంటుందోనని సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అకౌంట్లలో వేయాలా? లేక ఆ తర్వాత ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ పెట్టి రిలీజ్ చేయాలా? ఏ రకంగా చేస్తే పార్టీకి మైలేజ్ వస్తుంది? అనే విషయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రతి ఖరీఫ్ సీజన్‌కు జూన్, జులై మాసాల్లో రైతుబంధు నిధులు విడుదల చేస్తుంటారు. అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పుడు వేస్తే రాజకీయ ప్రయోజనం ఉంటుందనే కోణంలో సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

రాజకీయ ప్రయోజనం కోసం ఆరాటం

2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతుబంధు స్కీమ్ బీఆర్ఎస్ పార్టీ విజయానికి భారీగా ఉపయోగపడిందనే టాక్ ఉంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. కొన్ని చోట్ల ఓటింగ్‌కు వెళ్లే ముందు అకౌంట్స్‌లో డబ్బులు పడినట్టు సెల్ ఫోన్ మెసేజ్‌లు వచ్చాయి. దీంతో రైతుల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల పాజిటివ్ ఒపీనియన్ వచ్చిందనే చర్చ ఇప్పటికీ జరుగుతుంటుంది.

అయితే ఈసారి రైతుల అకౌంట్లలో డబ్బులు ఏ సమయంలో వేస్తే రాజకీయంగా కలిసి వస్తుందని ఆరా తీస్తున్నారు. ఈ నెల 22 వరకు దశాబ్ది వేడుకలు ఉన్నాయి. ఇదే సమయంలో రైతు బంధు నిధులు విడుదల చేయడం వల్ల ఏ మేరకు ప్రయోజనం ఉంటుంది? వేడుకలు ముగిసిన తర్వాత ప్రత్యేక పోగ్రామ్ పెట్టి నిధులు విడుదల చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో లెక్కలు వేస్తున్నట్టు తెలిసింది.

నిధులు రెడీ చేసుకున్న ఆర్థిక శాఖ

రైతుబంధు ఖరీఫ్ సీజన్ కోసం ఆర్థిక శాఖ కావాల్సిన నిధులను రెడీ చేసుకున్నది. ప్రతి సీజన్‌లో సుమారు రూ. 7500 కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏ క్షణమైనా రైతుబంధు నిధులను విడుదల చేయాలని ఆదేశించే చాన్స్ ఉంది. దీంతో ఆర్థిక శాఖ కొన్ని రోజులుగా అందుకు కావాల్సిన అమౌంట్‌ను రెడీ చేసుకున్నట్టు సమాచారం. ముందునుంచి అమలు చేస్తున్నట్టుగానే తొలి రోజు ఒక ఎకరం, మర్నాడు రెండు ఎకరాలు, ఆ తర్వాత మూడు, నాలుగు.. ఇలా వరసగా 25 ఎకరాలపై విస్తీర్ణం కలిగి ఉన్న రైతులకు ఆర్థిక సాయం చేయనున్నారు.

నియోజకవర్గం దాటొద్దు

దశాబ్ది వేడుకలు ముగిసేవరకు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బయటికి రావొద్దని సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు సెగ్మెంట్‌లోనే ఉండేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రభుత్వ ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలకు పార్టీ శ్రేణులను తరలించి, పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని సూచించినట్టు సమాచారం. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో జరిగిన పోగ్రామ్ వివరాలు, ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్న కార్యక్రమం వివరాలను ప్రగతిభవన్ వర్గాలకు ఎప్పటికప్పుడు పంపుతున్నట్టు తెలిసింది.

Read More: బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తున్న రిబోసిక్లిబ్ డ్రగ్.. అధ్యయనంలో వెల్లడి

బీర్ఎస్ అధినేత ఆశీర్వాదం ఎవరికో

Next Story

Most Viewed