మహిళా శక్తికి కేసీఆర్ జై.. ఇందిరా, సోనియా, ప్రియాంకలపై ప్రశంసల జల్లు!

by Malleboina Mahesh |   (  Updated:2026-04-29 04:21:06  IST  )

మహిళా నాయకత్వానికి కేసీఆర్ మద్దతు! ఇందిరా, సోనియా, ప్రియాంక గాంధీలపై ప్రశంసలు. పార్టీ నేతలకు 'అహంభావం' వీడాలని హెచ్చరిక.

మహిళా శక్తికి కేసీఆర్ జై.. ఇందిరా, సోనియా, ప్రియాంకలపై ప్రశంసల జల్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళ చేతిలో దేశాన్ని, ఇంటిని పెట్టినా సక్సెస్ ​అవుతుందని మాజీ సీఎం, బీఆర్ఎస్​అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు ​సమాచారం. గతంలో ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ దేశాన్ని పాలించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గొప్పతనం, మంచి పనులు, ఆ పార్టీకి చేసిన సేవలు, వారు మహిళా బిల్లు కోసం పడిన తపనను ఆయన వివరించినట్లు తెలిసింది. ఈనెల 27న జరిగిన సమావేశంలో కేసీఆర్​పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దేశానికి ప్రధానిగా ఇందిరా గాంధీ చేసిన సేవలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో పర్యటించినప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టిన తీరును సమావేశంలో చెప్పినట్టు తెలిసింది. కాంగ్రెస్​నేత వెంగళ్​రావు ఇందిరాగాంధీని ఏ విధంగా అవమానించారో గుర్తుచేశారు.

ఇటీవల మహిళా బిల్లుపై లోక్​సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించిన విధానాన్ని ఆయన ప్రశంసించినట్టు సమాచారం. గతంలో తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సోనియాగాంధీ మహిళా బిల్లు గురించి తనను కోఆర్డినేట్​చేయాలని సూచించారని గుర్తుచేశారు. కాంగ్రెస్​మహిళా బిల్లు గురించి చాలా ప్రయత్నాలు చేసిందన్నారు. మహిళా బిల్లు అమలైతే బాగుండేదని, వచ్చే ఎన్నికల్లో అమలు కావడంతో అనుమానమే అనే రీతిలో ఆయన ప్రసంగం సాగినట్టుగా తెలిసింది. మహిళా నాయకులు ముందుకు రావాలని, రాజకీయాల్లో తోవ ఇవ్వరని, తోవ చేసుకుని పోవాలని కేసీఆర్ ​అన్నట్టు సమాచారం. మహిళలపై కొంత వివక్ష ఉందన్నారు. నిజామాబాద్​జిల్లా అంకాపూర్​విజయగాథను పార్టీ నాయకులు అధ్యయనం చేయాలని ఆయన సూచించినట్లు తెలిసింది.

ఇంకా అహంభావం పోకుంటే ఎట్లా?

తమను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని వరంగల్​ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మహిళా నాయకురాలు కేసీఆర్ ​దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో కేసీఆర్​పార్టీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా కొందరు నాయకులకు ఇంకా అహంభావం తగ్గట్లేదని, అందరినీ కలుపుకుని పోవాలని, సమన్వయం చేసుకోవాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు తెలిసింది. ఇలాంటివి మళ్లీ రిపీట్ ​కావద్దని, వచ్చే రోజుల్లో అందరినీ కలుపుకుని వెళ్తేనే సక్సెస్​అవుతామని చెప్పారు. ఇప్పుడు కూడా మారకుంటే ఎట్లా? అని నిలదీసినట్టు సమాచారం.

రాసి వాసి ముఖ్యం

త్వరలోనే పార్టీ సభ్యత్వం ప్రారంభించనున్నట్టు కేసీఆర్​చెప్పారు. అయితే 2023కు ముందు మనకు 60లక్షల సభ్యత్వం ఉండేదని, ప్రజాప్రతినిధుల్లో సీఎం నుంచి గ్రామ వార్డు సభ్యుడి వరకు బీఆర్ఎస్​ వాళ్లే ఉన్నారని, కానీ చివరికి ఏమైంది.. పార్టీ అధికారం కోల్పోయిందని, అంత సభ్యత్వం ఉంటే ఏం లాభమని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈసారి ఏదో సభ్యత్వం బుక్కులు నింపడం కాకుండా పార్టీ కోసం చిత్తశుద్ధి, మంచి మనస్సుతో పనిచేసే వారిని చూసి సభ్యత్వాలు ఇవ్వాలని, అంతే కానీ లక్షల లక్షల సభ్యత్వం చేసినట్టు లెక్కలు చెప్పుకోవడం సరికాదన్నారు. రాసి కన్నా వాసి ముఖ్యమని సమావేశంలో పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పార్టీలో నిఖార్సైన వారు ఉండాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి వేయి నుంచి రెండు వేల వరకు నిఖార్సయిన కార్యకర్తలను తయారు చేసుకోవాలని కేసీఆర్ హితబోధ చేశారు.

కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ వ్యూహాత్మక మౌనం: గులాబీ గూటిలో అసలేం జరుగుతోంది?

Next Story