క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతునారు: రేవంత్ రెడ్డి

by Dishanational1 |
క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతునారు: రేవంత్ రెడ్డి
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలం తనుగుల ఇసుక క్వారీనీ పరిశీలించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. 'ఇసుక క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకే పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక దోపిడీ ప్రజలకు చూపెట్టడానికి ఇక్కడకు వచ్చాను. అక్రమ ఇసుక తరలించి రూ. కోట్లు కుడబెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలు వాడి అక్రమ ఇసుక తరలిస్తున్నారు. అధికారులను అడుగుదామంటే ఒక్క అధికారి కూడా అందుబాటులో లేడు. ఇక్కడ మొత్తం ప్రైవేట్ సామ్రజ్యంగా మారి అక్రమ ఇసుక తరలిస్తున్నారు. అక్రమ ఇసుకపై ఫిర్యాదులు చేసినా వారిని ఇబ్బందులకు గురి చేసి దాడులకు పాల్పడుతున్నారు. మానేర్ వాగులో ఈ రకంగా ఇసుక తీస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఎడారిగా మారే అవకాశం ఉంది. ఇసుక మాఫియా లో కేసీఆర్ కుటుంబం భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇంత అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఈ మాఫియాకు కేసీఆర్ కుటుంబానికి చెందిన జోగినపల్లి సంతోష్, జోగినపల్లి రవీందర్ రావు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే స్థానిక శాసన సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు ఏం చేస్తున్నారు. ఎమ్మేల్యే, ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇసుక దోపిడీని ప్రజలకు చూపించి కోర్టుకు వెళ్లి అక్రమ క్వారీలను ముసేసే వరకు పోరాటం కొనసాగిస్తుంది.

అక్రమ గ్రానైట్, ఇసుక మైనింగ్ వ్యాపారం కేసీఆర్ కుటుంబానికి ఆదాయ వనరుగా మారింది. ఇసుక మాఫియా వల్లనే కాళేశ్వరం కొట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర కొత్త కాదు. మా పాదయాత్ర వల్ల కేసీఆర్ కుర్చీ కదులుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పై బీఆర్ఎస్ పార్టీ దాడులు చేస్తుంది. దాడులు చేసి సమస్యను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దాడులకు భయపడదు. తప్పకుండా ప్రజా సమస్యలపై పోరాడుతుంది' అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ బల్మూరి వెంకట్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed