పోగొట్టుకున్న బంగారం దొరికిందోచ్..

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-24 11:24:31  IST  )

సంచిలో దొరికిన 13 తులాల బంగారాన్ని బాధితుడికి అందజేసిన ఆదర్శ దంపతులు.. దంపతులను సత్కరించిన పోలీసులు

పోగొట్టుకున్న బంగారం దొరికిందోచ్..
X

పోగొట్టుకున్న బంగారం దొరికిందోచ్..

-మానవత్వాన్ని చాటిన దంపతులు..

- సంచిలో దొరికిన 13 తులాల బంగారాన్ని బాధితుడికి అందజేత

-దంపతులను సత్కరించిన పోలీసులు

-నీతి,నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచిన ఘటన

దిశ, హుజురాబాద్ రూరల్ : మానవత్వం ఇంకా బతికే ఉందని భార్య భర్తలు నిరూపించారు. హుజరాబాద్‌ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయిన రమేష్ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామం నుంచి తన కుటుంబానికి చెందిన 13 తులాల బంగారాన్ని బ్యాగులో పెట్టుకుని హుజరాబాద్‌కు వస్తున్నాడు. మార్గమధ్యలో ఇప్పల నర్సింగాపూర్ గ్రామ శివారులో ఆ బ్యాగు బైక్ వెనక నుంచి జారి కింద పడిపోయింది. తన బంగారాన్ని పోగొట్టుకున్న రమేష్ ఆందోళనతో వెంటనే హుజరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

అదే సమయంలో హుజురాబాద్ మండలం ఇప్పల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సమ్మయ్య, నఫీజ దంపతులకు ఆ బ్యాగు దొరికింది. దానిని చూసి, అందులో ఉన్నది అత్యంత విలువైన వస్తువు అని గ్రహించారు. తమకు దొరికిన బ్యాగును వెంటనే పోలీసులకు అప్పగించి, ఆ బ్యాగు యజమానిని వెతికి పట్టుకోవాలని కోరారు. వారి నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు, రమేష్‌ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, సీఐ కరుణాకర్ సమక్షంలో ఆ బంగారాన్ని తిరిగి అప్పగించారు. పోగొట్టుకున్న బంగారం తిరిగి దొరకడంతో రమేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కష్టాల్లో ఉన్న ఒకరిని ఆదుకోవడానికి గొప్ప మనసు చూపించిన సమ్మయ్య, నఫీజ దంపతుల నిజాయితీని పోలీసులు ప్రశంసించారు. వారిని శాలువతో సత్కరించి, ఇతరులకు ఆదర్శంగా నిలిచినందుకు అభినందించారు. ఈ ఘటన సమాజంలో నిజాయితీకి, మానవత్వానికి నిలువుటద్దంలా నిలిచింది.

Next Story